Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన తాజా చిత్రం 'ఓటర్' ఫస్ట్లుక్కు విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అవుతోంది' అని నిర్మాతలు అన్నారు. మంచు విష్ణు హీరోగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ కుమార్ పూదోట తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న చిత్రం 'ఓటర్'. బుధవారం ఈ చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రముఖ కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకులు ప్రధాని మోడీ, అటల్ బిహారి వాజ్పాయి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్రెడ్డితో సహా పలువురి ముఖచిత్రాలతో నిండి ఓటర్గా విష్ణు తన ఇంక్ వేయబడిన వేలును చూపిస్తున్నట్టున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ చాలా శక్తివంతంగా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్ర ఓటర్దే. కానీ అటువంటి ఓటర్ ఎన్నికల తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే చిత్రమిది. కామన్ మ్యాన్ పాయింట్ కావడంతో తమిళంలో కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం. తమిళంలో ఈ చిత్రాన్ని 'కురళ్ 388' పేరుతో విడుదల చేస్తున్నాం. తమిళ తెరకు పరిచయమయ్యేందుకు విష్ణుకిది మంచి సినిమా అవుతుందని భావిస్తున్నాం' అని అన్నారు. 'తమిళ ప్రముఖ రాజకీయ నాయకుల ఫొటోలతో నిండిన 'కురళ్ 388' ఫస్ట్లుక్ పోస్టర్కు కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని భావిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం' అని నిర్మాత తెలిపారు.