Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా.. అని మదర్ థెరిస్సా చెప్పిన మాటలను ఆచరణలో పెడుతూ చిరంజీవి మరోసారి తన సహృదయతను చాటుకోవడం విశేషం. అనారోగ్యం, ఆర్థిక కారణాలతో ఆపదలో ఉన్న సీనియర్ హాస్యనటులు గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యకు తనవంతు సహాయంగా నాలుగు లక్షల రూపాయలను చిరంజీవి అందజేశారు. గత కొంత కాలంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో హాస్యనటులు గుండు హనుమంతరావు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని 'ఆలీతో జాలీగా' అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా చిరంజీవి తెలుసుకుని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజాకు రెండు లక్షల రూపాయల చెక్ను అందజేశారు. అలాగే మరో సీనియర్ కమెడియన్ పొట్టివీరయ్య ఆర్థిక పరిస్థితిని పేపర్లో చదివి చలించి పోయిన చిరంజీవి సతీమణి సురేఖ తనవంతు సాయంగా పొట్టివీరయ్య కుటుంబానికి రెండు లక్షల రూపాయలను 'మా' ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా 'మా' అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ,'రెండు రోజుల క్రితం చిరంజీవిగారు ఫోన్చేసి అర్జంట్గా ఇంటికి రమ్మన్నారు. గుండు హనుమంతరావు, పొట్టివీరయ్య కష్టాల్లో ఉన్నట్టున్నారు. వెంటనే వాళ్ళిద్దరికీ చెరో రెండు లక్షల రూపాయలను ఇవ్వమని చెక్లు ఇచ్చారు. ఆయన ఇచ్చిన అరగంటలోనే ఇద్దరికీ చెక్లను అందజేశాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎవరు కష్టాల్లో ఉన్నా వెంటనే సహాయం చేస్తానని చిరంజీవి చెప్పడం చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు.