Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోహన్బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదు
'కళలను, కళాకారులను గౌరవించే వ్యక్తుల్లో టి.సుబ్బరామిరెడ్డి ముందుంటారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రజలకు చాటి చెప్పాలనుకోవడం అభినందనీయం' అని మోహన్బాబు అన్నారు. కాకతీయ లలితా కళా పరిషత్ ఆధ్వర్యంలో 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' పేరుతో టి. సుబ్బరామిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా నటుడిగా 42 ఏండ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మోహన్బాబును 'విశ్వ నట సార్వ భౌమ' బిరుదుతో సత్కరించబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లోని పార్క్ హయత్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, 'కాకతీయుల పరిపాలన స్వర్ణయుగం. 600 ఏండ్ల క్రితమే తెలుగు సంస్కృతి, నాగరికతలు ఘనంగా చాటడంతోపాటు విభిన్న కళలను పోషించారు. ఎన్నో గొప్ప దేవాలయాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని ఎంతో చాతుర్యంతో నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచి తెలుగు జాతికి వారసత్వాన్ని అందించారు. వరంగల్ రాజధానిగా 300 ఏండ్లు తెలుగు వారిని పరిపాలించారు. వాళ్ళ పేరు మీద 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 17న హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాం. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు చేతుల మీదుగా వేడుక ప్రారంభమవుతుంది. సుమారు 560 చిత్రాల్లో నటించి, చిత్ర పరిశ్రమలో 42 ఏండ్లు పూర్తి చేసుకున్న మోహన్బాబును 'విశ్వ నట సార్వభౌమ' బిరుదుతో ఈ వేడుకలో సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఆధ్యాత్మిక, రాజకీయ, సినీ, సాంస్కృతిక ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు.
తర్వాత కూడా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో రెండు మూడు నెలలకు ఒకసారి కాకతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో పద్మజా రెడ్డి, సుజాత తన నృత్యంతో ఆకట్టుకోనున్నారు. త్వరలోనే సినిమా ఉంటుంది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం'
అని అన్నారు. 'నాకు ఇవ్వనున్న బిరుదుల గురించి సుబ్బరామిరెడ్డి చెప్పినప్పుడు 'బిరుదులు నాకు ఎందుకు? వద్దు' అని చెప్పా. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన అభీష్టాన్ని కాదనలేకపోయా. అందరి ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే చాలు' అని మోహన్బాబు తెలిపారు. కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ విజరు కుమార్ చెబుతూ, 'సుబ్బరామిరెడ్డిగారు ఏం చేసినా అది క్లాస్గా మంచి హిట్ అవుతుంది. ఇప్పుడు క్లాస్, మాస్ మేళవింపుగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ బిరుదును మోహన్బాబుకి సరైన సమయంలో, సరైన విధంగా ఇవ్వడంగా భావిస్తున్నాం' అని చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నృత్యకారిణిలు పద్మజారెడ్డి, వింజమూరి సుజాత పాల్గొన్నారు.