Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రియలిస్టిక్గా ఉండే చిత్రం 'రంగులరాట్నం'. తల్లీకొడుకుల మధ్య ఎమోషన్స్, ఓ కుర్రాడికి, అతనికి కాబోయే భార్యకు మధ్య వచ్చే సన్నివేశాలు కంట తడిపెట్టిస్తాయి' అని అంటున్నారు నాగార్జున. రాజ్తరుణ్, చిత్రా శుక్లా జంటగా శ్రీరంజని దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన సినిమా 'రంగులరాట్నం'. నేడు (ఆదివారం) ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియో వడ్డించే పొంగలి అని భావిస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. బొబ్బట్టులాగా చాలా తీపిగా ఉంటుంది. సినిమాను నెల రోజుల క్రితమే రెడీ చేసి పెట్టాం. లక్కీగా నాకు సంక్రాంతికి డేట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. నవ్వుకుంటూ, అప్పుడప్పుడు కొంచెం కంటతడి పెడుతూ ప్రేక్షకులు చూస్తారు. ఏడాది క్రితం ఈ కథకు నేను ఓకే చెప్పా. ఇటీవల సినిమా చూశా. ప్లజెంట్ సర్ప్రైజ్లాగా అనిపించింది. ఈ సినిమా మా సంస్థకు మంచి పేరు తెస్తుంది. మా బ్యానర్లో ఎవరు ఏం చేసినా క్రెడిట్ నాకే దక్కుతుంది. అందుకే చాలా హ్యాపీ. శ్రీరంజని ఎలా నెరేట్ చేసిందో నాకు గుర్తులేదు. కానీ సినిమాను అనుభవం ఉన్న దర్శకురాలిగా తెరకెక్కించింది. ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్, అమ్మాయి భావోద్వేగాలను ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించింది. రాజ్తరుణ్ 'ఉయ్యాల జంపాల'లో నేచురల్గా నటించాడు. ఒక సీన్లో తల్లిని ప్రేమించే అబ్బాయిలాగా బిత్తరచూపులతో చేశాడు. అది చూసి నాకు రకరకాల విషయాలు గుర్తొచ్చాయి. అతని యాస ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరోయిన్ చిత్ర సినిమాలో చాలా అందంగా కనిపిస్తుంది. ప్రియదర్శి సినిమాకు పెద్ద అసెట్ అవుతాడు. సహజమైన కామెడీ టైమింగ్ ఉన్న చిత్రమిది. సితారకు, రాజ్తరుణ్కి మధ్య తల్లీకొడుకుల అనుబంధం బాగా పండింది. ఈ సంక్రాంతికిది స్వీట్ లవ్లీ ఫిల్మ్ అవుతుంది' అని అన్నారు. ''ఉయ్యాల జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. దర్శకురాలు శ్రీరంజనికి తనకేం కావాలో స్పష్టంగా తెలుసు. ఆర్టిస్టుల నుంచి ఉత్తమ నటన రాబట్టుకుంటారు. ప్రియదర్శి, నా మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి. శ్రీచరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రీరికార్డింగ్తో సినిమాను మరో లెవల్కి తీసుకెళ్ళాడు' అని రాజ్ తరుణ్ చెప్పారు.
దర్శకురాలు శ్రీరంజని చెబుతూ, 'నన్ను, నా కథను నమ్మి ఛాన్స్ ఇచ్చిన నాగార్జునకు థ్యాంక్స్. రెండు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా చేశాం. మేకింగ్ విషయంలో సుప్రియ, ప్రసాద్ ఎంతో సపోర్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో ద్వారా దర్శకురాలిగా లాంచ్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. నాగార్జునకు నేను పెద్ద అభిమానిని. ఈ కథ విన్నప్పుడు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడ్డాను. ఇటీవల సినిమా చూసి 'వెరీ స్వీట్ అండ్ నైస్' అని చెప్పగానే నాకు ధైర్యం వచ్చింది. సినిమా అంతా కలర్ఫుల్గా ఉంటుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సితార, చిత్రా శుక్లా, శ్రీచరణ్, ప్రియదర్శి పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.