Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కారణంగా 'క్వీన్' (తెలుగు) సినిమా నుంచి దర్శకుడు నీలకంఠ తప్పుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదు' అని తమన్నా తెలిపింది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'క్వీన్'ను తెలుగులో తమన్నా కథానాయికగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. నీలకంఠ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తమన్నాకు, నీలకంఠకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో నీలకంఠ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
ఈ సందర్భంగా దీనిపై తమన్నా స్పందించింది. 'నా వల్ల డైరెక్టర్ నీలకంఠ తప్పుకున్నారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సినిమా నిర్మాణం విషయంలో నాకు గాని, నా టీమ్కుగానీ ఎలాంటి అధికారం లేదు. ఆ బాధ్యత పూర్తిగా నిర్మాతలదే. నీలకంఠ సార్ అంటే నాకు గౌరవం ఉంది. నిర్మాత మను కుమారన్ నవంబర్లోనే సినిమాలో కొన్ని మార్పులు చేశారు. నాలుగు భాషల్లో వస్తున్న ఈ సినిమా మాకు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. అందరం ఐక్యమత్యంతో వ్యవహరిస్తూ చిత్రీకరణ జరుపుతున్నాం' అని చెప్పారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం విదితమే. తమిళంలో కాజల్ 'క్వీన్'గా నటిస్తుండగా, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ నటిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో 'నా నువ్వా', 'లవ్ ఉత్సవం', హిందీలో 'ఖామోషి', మరాఠిలో 'ఎ.బి.సి' చిత్రాల్లో నటిస్తోంది.