Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా దర్శక, నిర్మాత వై.వి.ఎస్.చౌదరి
'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నాకు దేవుడు. ఆయన దివ్యమోహనరూపమే నన్ను సినిమాలవైపు, తద్వారా సినీ పరిశ్రమకు తీసుకొచ్చింది' అని అన్నారు దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి. నేడు(గురువారం) ఎన్టీఆర్ వర్థంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైవిఎస్ చౌదరి చెబుతూ, 'ఎన్టీఆర్ తెలుగుజాతి ముద్దు బిడ్డ, ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజలందరూ ఆప్యాయంగా పిలుచుకునే 'అన్న'. అభిమానుల పాలిట దైవం. ఆయన రూపం ఎంతో మందికి స్ఫూర్తి. ఆ రూపమే రాజకీయాల్లో తాను ప్రవేశ పెట్టిన సంచలన సంక్షేమ పథకాల ద్వారా మరెందరికో జనాకర్షణలో మర్గదర్శకంగా నిలిచింది. అంతేకాకుండా అప్పటి దాకా 'మదరాసీ'లుగా పిలవబడుతున్న 'తెలుగుజాతి'కి ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపుని, తెలుగుజాతీలో ఓ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆయన తన జీవన విధానం ద్వారా చాలా ఆశయాలను మన ముందు వదిలి వెళ్ళారు. వాటిలో 'ఏ పనైనా అంకితభావంతో చేయడం, ఆ పని ఎంత కష్టమైనా ఇష్టపడి చేయడం, తాను నమ్మిన ఆ పనిని సాధించడంలో మడమ తిప్పకుండా పోరాటం చేయడం' లాంటివి మచ్చుకకి కొన్ని మాత్రమే. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మందికి తన రూపంతో ఉత్తేజాన్నిచ్చారు. తన ఆశయాలు, ప్రసంగాల ద్వారా ఇంకెంతో ఉద్వేగాన్ని నింపారు. దీంతోపాటు తన సినిమాల ద్వారా మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళ ముందు కదలాడి, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ, ఓ మహాయోధుడిగా, ఓ కారణజన్ముడిలా, ఓ యుగ పురుషుడిలా అవతరించారు. నా సొంత బ్యానర్ 'బొమ్మరిల్లు వారి'పై నేను నిర్మించే సినిమాల ప్రారంభంలో వచ్చే ఆయన ఫోటోపై 'నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో, నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ, ప్రభూ.. ఈ జన్మకూ' అంటూ సంగీత సవ్యసాచి ఎం.ఎం.కీరవాణి స్వయంగా రచించి, స్వరపరచి ఆలపించిన ప్రార్ధనాగీతంతో మొదలై, మళ్ళీ సినిమా చివరిలో ఆయన అదే ఫొటోపై కృతజ్ఞతాభావంతో పూర్తవుతుంది. మరణం లేని జననం ఆయనది, అలుపెరగని గమనం ఆయనది, అంతేలేని పయనం ఆయనిది. తెలుగు జాతికి గర్వకారణం ఆయన. ఆ అవిశ్రాంత యోధుడు సరిగ్గా 22ఏండ్ల క్రిందట 1996 జనవరి 18న మరో మహత్తర కార్యసాధన కోసమై ఈ భువి నుండీ దివికేగాడు. అప్పటి నుండీ ప్రతీ సంవత్సరం ఇదే రోజున, ప్రతీ తెలుగువాడూ బాధాతప్త హృదయాలతో, ఆ మహనీయుడిని స్మరించుకోవడం అనేది తమ జాతిని, తమ భాషనీ, తమని తాము గౌరవించుకున్నట్టుగా భావిస్తున్నాను' అని తెలిపారు.