Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'రంగస్థలం'లో నటిస్తున్న రామ్చరణ్ నెక్ట్స్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం విదితమే. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్పై దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ, 'మెగా పవర్స్టార్ రామ్చరణ్, బోయపాటి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. హీరోలను శక్తివంతంగా, అద్భుతంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను. అద్భుతమైన కథతో రామ్చరణ్ను సరికొత్త రీతిలో ఈ సినిమాలో చూపించబోతున్నారు. మేకింగ్లో రాజీపడకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. తమిళ నటుడు ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరారులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన మొదటి షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నాం. మెగా అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు దీటుగా సినిమాను రూపొందిస్తాం' అని అన్నారు. స్నేహ, హిమజ, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్.