Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను అన్ని పుస్తకాలు, పురాణాలు చదువుతాను. అన్నింటి సారాంశాన్ని తీసుకుంటాను. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన నందమూరి తారక రామారావు జీవిత సారాంశాన్ని తీసుకుని 'ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కిస్తున్నాం' అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'జై సింహా'. నయనతార, నటాషా దోషి, హరిప్రియ కథానాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కళ్యాణ్ నిర్మాత. సంక్రాంతి సందర్భంగా ఇటీవల సినిమా విడుదలైంది. ఇందులో బ్రాహ్మణులను ఉద్దేశించి ఉన్న సందేశం నచ్చి రెండు రాష్ట్రాల బ్రాహ్మణులు గురువారం హైదరాబాద్లో 'జై సింహా' చిత్ర బృందాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఇకపై బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలను తీయకూడదు. ఎవరనీ అవమానించకూడదని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాటల రచయిత రత్నం మంచి కథను అందించడంతోపాటు ఆకట్టుకునే డైలాగులు రాశారు. కె.ఎస్.రవికుమార్తో సినిమా చేయాలన్న నా కోరిక తీరినందుకు ఆనందంగా ఉంది. సమిష్టి కృషితోనే సినిమా చేశాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. నటన అంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించాలి. అప్పుడే ఆ పాత్ర రక్తి కడుతుంది. నాన్నగారి వర్ధంతి రోజున వేద పండితులు ఆశీర్వచనాల వర్షం కురిపించడం చాలా ఆనందంగా ఉంది. నా అరవై ఏట రామానుజాచార్యులు జీవిత కథతో ఓ సినిమా చేయబోతున్నా' అని అన్నారు.
'బాలయ్యబాబు అద్భుతమైన సోషల్, చారిత్రక, జానపద చిత్రాలెన్నో చేశారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా అపహాస్యం చేస్తూ సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని, వారి గొప్పదనాన్ని చాటుతూ 'జై సింహా' చిత్రంలో చూపించారు. కులాలకు, మతాలకు అతీతంగా ఆయన ఎన్నో ఇలాంటి సినిమాలు చేయాలి' అని ఆల్ ఇండియా బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు. 'కుంభకోణంలో 2500మంది బ్రాహ్మణులతో ఎపిసోడ్ని చిత్రీకరించాం. అంత మందిని సమకూర్చడానికి చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చేసి ఆ సీన్ విని ఎంతో ఇన్స్పైర్ అయి నటించారు. ఆ సీన్లో బాలయ్య సింగిల్ టేక్లో డైలాగులు చెబుతుంటే పక్కన ఉన్న వారంతా ఆశ్యర్యపోయి చూశారు' అని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు.