Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఐతే 2.0'. ఇంద్రనీల్ సేన్ గుప్తా,
జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్మ్ 9 పతాకంపై కె.విజయరామరాజు, డా||హేమంత్ వల్లపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్లో వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన నందిని రెడ్డి మాట్లాడుతూ, 'ఈ సబ్జెక్ నాకు తెలుసు. సూపర్గా ఉంటుంది. విన్నప్పుడు రోమాలు నిక్కబొడిచాయి. నేటి తరానికి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. కచ్చితంగా కొత్తగా ఉంటుందని నమ్ముతున్నా' అని అన్నారు. 'రాజ్ మాదిరాజు నా సినిమాలకు పనిచేశాడు. తను మంచి టెక్నీషియనే కాదు, మంచి నటుడు కూడా. తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ రావడం అభినందనీయం' అని రాజ్ కందుకూరి తెలిపారు. చిత్ర దర్శకుడు రాజ్ మాదిరాజు చెబుతూ,
'ప్రస్తుతం మనమంతా ఆన్లైన్లోకి వెళ్ళిపోయాం. జీవితానికి సంబంధించిన ప్రతి విషయమూ మొబైల్ ఫోన్లో ఉంటోంది. ఇటీవల వి.వి.వి.ఎస్.లక్ష్మణ్ అకౌంట్ నుంచి పది లక్షల రూపాయలను హ్యాక్ చేశారు. అలాగే దేశ భద్రతకు సంబంధించిన డీఆర్డీఓ సమాచారం
కూడా హ్యాక్కు గురైంది. ఈ నేపథ్యంలో ఫోన్స్ని కూడా హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి?,
ఆన్లైన్ సౌకర్యాల వెనుక పెద్ద ప్రమాదం దాగుందని తెలిపే చిత్రమిది. నలుగురు ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుర్రాళ్లు కొన్నాళ్ళపాటు నిరుద్యోగులుగా ఉంటారు. దీంతో వాళ్ళలో వచ్చిన ఉక్రోశం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనేది సినిమాలో ఆసక్తికరం. సందేశాత్మకంగా రూపొందిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మార్చి 16న సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.