Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు (61) ఇకలేరు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆహ్లాదకర వినోదాన్ని అందించి తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కమెడియన్ గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చాలా కాలం నుంచి హాస్పిటల్లో చికిత్స పొందారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని ఎర్రగడ్డ శ్శశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. దాదాపు 400కి పైగా చిత్రాల్లో భిన్న హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకుల మోముపై చెరగని నవ్వుగా ముద్ర వేసుకున్న ఆయన 'ఆనందో బ్రహ్మ', 'అమృతం' వంటి తదితర సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం పడీ పడీ నవ్వుకునేలా చేశారు. అటు వెండితెర ప్రేక్షకులకు, ఇటు బుల్లితెర ప్రేక్షకులకు ఆయన నవ్వు శాశ్వతంగా దూరమైన నేపథ్యంలో గుండు హనుమంతరావు జీవిత ప్రయాణం గురించి..
హాస్యానికి సరికొత్త భాష్యం చెప్పిన గుండు హనుమంతరావు 1956, అక్టోబర్ 10న విజయవాడలో జన్మించారు. తల్లి సరోజిని, తండ్రి కాంతారావు. ఆయనకు భార్య ఝాన్సీ రాణి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. 2010లో భార్య ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మరణించింది. కుమార్తె కూడా కొద్ది కాలం కిందటే కన్నుమూశారు. భార్య, కూతురు మరణం ఆయన జీవితాన్ని అత్యంత దయనీయంగా మార్చేసింది. దీంతోపాటు కిడ్నీకి సంబంధించిన వ్యాథి, ఆర్థిక పరిస్థితి ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆయన పరిస్థితి గమనించిన ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలను, చిరంజీవి 2 లక్షల రూపాయలను సహాయం చేశారు. చిన్నతనంలో హనుమంతరావు చదువంతా విజయవాడలోనే సాగింది. పెదనాన్న కృష్ణబ్రహ్మ మంచి గాయకులు, నటులు. ఆయన వల్లే నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం 'రావణబ్రహ్మ'. సినిమాల్లోకి రాకముందు కొన్నాళ్ళపాటు మిఠాయి వ్యాపారం చేశారు. మద్రాస్లో ఆయన వేసిన నాటకాలు చూసి దర్శకుడు జంధ్యాల తాను రూపొందించిన 'అహనా పెళ్ళంట' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అలా నటుడిగా ఆయన తెరంగేట్రం చేశారు. సూర్యకాంతమ్మ చేసే హాస్యంలా అత్యంత సహజంగా, సున్నితంగా, ఆస్వాదించేలా తన హాస్యం ఉండాలనుకున్నారు. ఆ దిశగానే తన నటనా శైలిని అలవర్చుకున్నారు. మూడు దశాబ్దాల సినీ కెరీర్లో 400లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 'అహనా పెళ్ళంట', 'మాయలోడు', 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'యమలీల', 'టాప్ హీరో', 'కొబ్బరి బోండాం', 'బాబారు హోటల్', 'శుభలగం', 'క్రిమినల్', 'పెళ్ళాం ఊరెళితే' వంటి చిత్రాల్లో అత్భుతమైన నటనను కనబర్చి ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా రాజేంద్రప్రసాద్తో కలిసి నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు విజయాన్ని సాధించాయి. 'రాజేంద్రుడు గజేంద్రుడు'లో రాజేంద్రప్రసాద్ సహాయకుడిగా పేదవాడిగా గుండు హనుమంతరావు నటన ప్రేక్షక హృదయాలను కట్టిపడేస్తుంది. పలు సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తుంది. 'మాయలోడు'లోనూ రాజేంద్రప్రసాద్ ఫ్రెండ్ పండు పాత్రలో తన వైవిధ్యమైన, సహజత్వమైన నటనతో మెప్పించారు. 'యమలీల'లోనూ అలీతో కలిసి అలరించారు. 'క్రిమినల్', 'పేకాట పాపారావు', 'సాహస వీరుడు సాగర కన్య'లో గుండుగా కడుపుబ్బా నవ్వించారు. వీటితోపాటు 'అన్నమయ్య', 'పెళ్ళానికి ప్రేమ లేఖ-ప్రియురాలికి శుభలేఖ', 'అమ్మదొంగా', 'గౌతమ్ ఎస్.ఎస్.సి' వంటి చిత్రాలు తనకు సంతృప్తినిచ్చిన సినిమాలని హనుమంతరావు పలు సందర్భాల్లో తెలిపారు. ఆయన నటుడే కాదు మంచి రచయిత కూడా. పంచ్ డైలాగులు, సామెతలను వ్యంగ్యంగా రాసుకునే వారు. వాటిని ఓ పుస్తకంగా తీసుకురావాలనేది ఆయన కోరిక. ఇక బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం కడుపుబ్బ నవ్వించారు. 'అమృతం' సీరియల్తో ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా దగ్గరయ్యారు. అమాయకపు అంజి పాత్రలో ఆయన నటనకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సీరియల్తోపాటు 'ప్రమేషియా', 'మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం' సీరియల్స్కుగానూ నంది అవార్డులను దక్కించుకున్నారు.
ప్రముఖుల సంతాపాలు..
గుండు హనుమంతరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
హనుమంతరావును కాపాడటానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరం. సినీ, టీవీ, రంగస్థలంలో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- కేసీఆర్, ముఖ్యమంత్రి
తెలుగు చిత్ర సీమలో గుండు హనుమంతరావు తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలపాటు వినోదాన్ని పంచారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించా. పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించా. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. ఆయన మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది - చిరంజీవి
మా బ్యానర్లో చాలా సినిమాల్లో నటించిన ఆయన మంచి నటుడు మాత్రమే కాదు, మంచి వ్యక్తి కూడా.
ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు - మోహన్బాబు
చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచిన ఆయనతో నేను కొన్ని సినిమాల్లో నటించా. మృదు స్వభావి. ఆయన మరణం బాధాకరం - బాలకృష్ణ
నాకూ, శివాజీ రాజాకు, హనుమంతరావుకు ఉన్న అనుబంధం ప్రత్యేకం. ఆయన చనిపోయారని తెలిసి అలజడి చెందాను. నమ్మలేకపోయా. ఆయన అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. కల్మషం లేని మనిషి - బ్రహ్మానందం