Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుట్టినరోజు వేడుకలో విజయనిర్మల
'దాసరి నారాయణరావు ఓసారి పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటికి వచ్చి 'ఏ స్టార్ హీరోయిన్కీ ఈ రేంజ్ క్రేజ్ లేదు' అని అన్నారు. అదే నాకు పద్మ భూషణ్ అవార్డుతో సమానం' అని విజయ నిర్మల అన్నారు. నానక్రామ్గూడలోని స్వగృహంలో మంగళవారం అభిమానులు, సినీ ప్రముఖుల నడుమ విజయనిర్మల 73వ పుట్టిన రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 73వేల రూపాయల చెక్ను పేద కళాకారులకు విరాళ నిమిత్తం 'మా' అసోసియేషన్కు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, 'విజరు నిర్మల, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతోనే కాదు చంద్రమోహన్, రంగనాథ్ వంటి నటులతోనూ సినిమాలు చేసిన ఘనత విజయ నిర్మలకే దక్కింది. ఆమె దర్శకత్వం వహించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. మరో ఆరు సినిమాలు చేసి 50 సినిమాలను పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆమె సేవలను గుర్తించి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందించాలని కోరుకుంటున్నాం' అని అన్నారు.
'నా పుట్టిన రోజును గుర్తుంచుకుని శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు' అని విజయ నిర్మల చెప్పారు. సీనియర్ నరేష్ చెబుతూ, 'కృష్ణ, విజయనిర్మల చిత్రపరిశ్రమలో ఆదిదంపతులు. ఆమె నాకే అమ్మ కాదు, అభిమానులందరికీ అమ్మే. ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి' అని చెప్పారు. 'దాసరి తొలి చిత్రంలో విజయనిర్మల కథానాయిక. బాపు తొలి చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్. విజయశాంతిలాంటి స్టార్ హీరోయిన్ని 'కిలాడి కృష్ణుడు'తో తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా విజయ నిర్మలనే. దర్శకురాలిగా 50 సినిమాలు పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి విజయనిర్మలకు సరైన గుర్తింపు రాలేదు. పద్మ అవార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం' అని బి.ఏ.రాజు తెలిపారు.
'విజయ నిర్మలకు పద్మ అవార్డులివ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రక్తంతో లెటర్ రాస్తాం' అని అభిమానులు చెప్పారు. 'మా' అధ్యక్షులు శివాజీ, ఏడిద శ్రీరామ్, బెనర్జీ, ఉత్తేజ్, సురేష్ కొండేటి, ప్రభు, శాఖమూరి మల్టీఖార్జునరావు తదితరులు పాల్గొని విజయనిర్మలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.