Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'యదార్థ కథలకు కల్పిత అంశాలను జోడించినప్పుడు ఆ సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది' అని అంటున్నారు బాలీవుడ్ దర్శక, నిర్మాత రాజ్ కుమార్ హిరానీ. భిన్న చిత్రాల రూపకల్పనతో బాలీవుడ్లోనే కాదు యావత్ భారతీయ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో హిరానీ ఒకరు. ప్రస్తుతం మున్నాభారు సంజరు దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే బయోపిక్ను రూపొందిస్తున్నారు. ఇటీవల ఇండియన్ డాక్యుమెంటరీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో 'ఫిల్మ్స్ ఫర్ ఛేంజ్' అంశంపై హిరానీ మాట్లాడుతూ, 'కొన్ని కథలను ఫిక్షనల్గా చెబితే, అవి ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. మరికొన్ని కథలను డాక్యుమెంటరీ రూపంలో తీస్తే అమితాసక్తిని రేకిత్తిస్తాయి. అయితే సంజరు దత్ బయోపిక్ను డాక్యుమెంటరీగా తీయాలనే ఆలోచనే రాలేదు. ఎందుకంటే అది సినిమాగా, ఫిక్షన్ అంశాలతో చెబితేనే ఆడియెన్స్కు బాగా కనెక్ట్ అవుతుందనిపించింది. 'పీకే' సినిమాను మొదట దేవుడు, మతం గురించి ప్రధానంగా తీయాలనుకున్నాను.
కానీ సినిమా తీసే క్రమంలో చాలా తక్కువ మాత్రమే వాటి గురించి చెప్పగలిగాను. నేననుకున్నది రివర్స్గా జరిగింది. దేవుడు, మతం గురించి కల్పితం చేసి చాలా చెప్పొచ్చు, కానీ ఆ సినిమాకు అంత వరకు సరిపోతుందనిపించింది. ఫిక్షన్ చిత్రంలో షుగర్ కోట్ వేస్తూ మనం చెప్పాలనుకున్న విషయాన్ని వినోదాత్మకంగా చెప్పొచ్చు. 'సంజు' చిత్రం ఎంగేజ్ చేసే ఫిక్షనల్ ఫిల్మ్. ఇందులో ఒక నటుడిలా మరో నటుడు నటిస్తాడు. అది ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది' అని చెప్పారు. ఈ సినిమాలో సంజరు దత్ పాత్రలో రణ్బీర్ కపూర్ నటిస్తుండగా, అనుష్కశర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, టబు, మనీషా కోయిరాలా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.