Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రంగస్థలం' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్
'నాకు 'ఖైదీ' ఎలాగో, రామ్చరణ్కు 'రంగస్థలం' స్టార్ స్టేటస్ను పెంచే చిత్రమవుతుంది, చరణ్ కెరీర్లో తలమానికమైన సినిమాగా నిలుస్తుంది' అని చిరంజీవి అన్నారు. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్(సీవీఎం) సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'రంగస్థలం'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం వైజాగ్లో వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ, 'నిర్మాతలు విజయవంతమైన సినిమాలు చేసి వారికంటూ ఓ బ్యానర్ వ్యాల్యూను ఏర్పర్చుకున్నారు. ప్రతి హీరో కూడా వారితో సినిమాలు చేయాలను కుంటున్నారంటే వాళ్ళు ఎంత మంచి నిర్మాతలో అర్థం చేసుకోవచ్చు. దేవిప్రసాద్, త్రివిక్రమ్ రావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ వంటి స్టార్ నిర్మాతల స్థాయి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా వారికి హ్యాట్రిక్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. దర్శకుడు సుకుమార్ అద్భుతమైన పనితనాన్ని చూపించారు. నాకు తను కథ ఎలా చెప్పాడో, అంతే ప్యూర్గా ఎమోషనల్గా తెరకెక్కించాడు. విలేజ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫస్ట్సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా చూశా. నేను చాలా ఎంజారు చేశా. ప్రేక్షకులందరినీ అలరిస్తుంది. చరణ్ నటుడిగా ఎదిగే సినిమా ఇది. చరణ్తో సుకుమార్ ఇంత మంచి సినిమా చేసినందుకు నటుడిగా ఈర్ష్య పడుతున్నా, తండ్రిగా గర్వపడుతున్నా. ఓ కన్విక్షన్తో సినిమాలోని పాటలను తెరకెక్కించారు. ఎక్కడా గ్లామర్కు పోకుండా అత్యంత సహజంగా రూపొందించారు. హీరో పాత్రను డీ గ్లామరైజ్ చేయించి, చరణ్ కెరీర్లో ఓ తలమానికమైన సినిమాను చేసిన సుకుమార్కు అభినందనలు. సినిమా క్రెడిట్ అంతా ఆయనదే. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించారు. నాలుగు రోజుల్లో అంత మంచి సాంగ్స్ ఇచ్చాడని తెలిసి ఆశ్చర్యపోయా. చంద్రబోస్ నేటివిటికి తగ్గట్టుగా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. రత్నవేలు ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. రామకృష్ణ, మోనిక సెట్స్ బాగా వేశారు. ఆ సెట్ రియల్ లొకేషన్లా అనిపించింది. తనకు ఈ సినిమాతో అవార్డులు ఖాయం. ఈ సినిమా ప్రజలను ఆకట్టుకోవడమే కాదు, అన్ని విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంటుంది. జాతీయ స్థాయిలో కూడా అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు. జాతీయ అవార్డు రాకుంటే అన్యాయం జరిగినట్టే అవుతుంది. అలాగే ఈ ఏడాదిలో అద్భుతమైన సినిమా అవుతుందని కోరుకుంటున్నా' అని అన్నారు.
'నిర్మాతలు రాజమండ్రిలో షూటింగ్ సమయంలో దాదాపు 500 మంది ఉండటానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి కంఫర్ట్గా ఉంచారు. రత్నవేలు ఓ ఊరుని ఎంతో అందంగా చూపించాలో అంత అందంగా చూపించారు. రామ్లక్ష్మణ్ ఎమోషన్స్తో ఫైట్స్ కంపోజ్ చేశారు. నాన్నగారు నాలుగైదు సార్లు నెల్లూరికి తీసుకెళ్ళారు. 'ఆపద్భాందవుడు' సినిమా జరుగుతున్నప్పుడు పూడిపల్లి గ్రామానికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ఈ సినిమాతో సుకుమార్ నా కోరిక తీర్చాడు. సమంతతో నటించేటప్పుడు ఎనర్జీ వస్తుంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. ఆయనతో చేసిన రెండో చిత్రమిది. చంద్రబోస్ అందరికీ అర్థమయ్యే రీతిలో సాహిత్యాన్ని అందించారు. ఇంత మంచి సినిమాకు కారణమైన సుకుమార్కు హ్యాట్సాఫ్. నాకే ఓ కొత్త చరణ్ని చూపించాడు. సుకుమార్ వల్ల నాపై నాకే గౌరవం పెరిగింది. గడ్డం లుక్, లుంగీని బాగా ఎంజారు చేశాను. మా అమ్మానాన్నలతోపాటు ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది' అని రామ్చరణ్ తెలిపారు.
సుకుమార్ మాట్లాడుతూ, 'చిరంజీవి ఈ సినిమా చూసి ఎంతో బాగా ప్రశంసించారు. నిర్మాతలు మా టీమ్ను బాగా చూసుకున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ కారణంగా నేను మంచి దర్శకుడిని కాగలిగాను. దేవిశ్రీ ప్రసాద్ సిచ్చ్యువేషన్ విని, కేవలం మూడున్నర రోజుల్లోనే గొప్ప మ్యూజిక్ అందించారు. నా ఎమోషన్స్ను చక్కగా క్యారీ చేశాడు. సమంతతో లైఫ్లాంగ్ సినిమాలు చేయాలని ఉంది. రామకృష్ణ వేసిన సెట్ మనకు కనపడదు. అంత బాగా వేశాడు. తనకు నేనే ఓ అవార్డును క్రియేట్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయేందుకు చరణ్ ఎక్కువ టైమ్ తీసుకోలేదు. చరణ్ నటన చూసి మేమేకాదు, ప్రకాష్ రాజ్ లాంటి నటుడు కూడా క్లాప్స్ కొట్టాడంటే తను ఎలా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు' అని అన్నారు. 'సినిమా బాగా రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ నెల 30న సినిమాను గ్రాండ్గా విడుదల చేస్తున్నాం' అని నిర్మాతలు తెలిపారు.