Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ రిలీజ్ వేడుకలో కళ్యాణ్రామ్
'నా హృదయానికి దగ్గరైన చిత్రం 'ఎంఎల్ఏ'. ఇందులో కొత్త కళ్యాణ్ రామ్ని చూస్తారు' అని కళ్యాణ్ రామ్ అన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కిరణ్రెడ్డి, భరత్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎంఎల్ఏ'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, 'కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే నాకిష్టం. ఈ చిత్రనిర్మాతలు అలాంటి వారు. తప్పకుండా భవిష్యత్లో పెద్ద నిర్మాతలు అవుతారు. 'పటాస్' కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఈ సినిమాకు కూడా అంతే ఎగ్జైట్ అయ్యాను. ఉపేంద్ర కళ్లకు కట్టినట్టు నెరేషన్ ఇచ్చాడు. సినిమాలో నన్నుకొత్తగా చూపించాడు. కొత్త దర్శకుడిని గైడ్ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్ది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ది భార్యభర్తల సంబంధం. నేను పనిచేసిన కెమెరామెన్స్లో ప్రసాద్ మూరెళ్ల ది బెస్ట్. రవికిషన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య. ఆయన బోజ్పూరిలో సూపర్స్టార్. అలాంటి ఓ వ్యక్తి మన ఇండిస్టీలో నెగటివ్ పాత్రలు పోషించడం గొప్ప విషయం. 500సినిమాలు చేసిన రవికిషన్ ఇంకా ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆయన్ను చూసి ఎన్స్పైర్ అయ్యాను. కాజల్తో నాకు రెండో సినిమా. నేను 14 సినిమాలు చేస్తే, తను 50 సినిమాలు చేసింది. అందుకు కారణం తన డెడికేషన్. మరో 50 సినిమాలు చేయాలని కోరకుంటున్నా. ఈ సినిమాలో కొత్త కళ్యాణ్రామ్ను చూస్తారు. సినిమాను చూసిన వారు బోర్గా ఫీలవ్వరు. ప్రతి ఒక్కరి కష్టం తెరపై కనిపిస్తుంది. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది' అని అన్నారు. 'రియల్ లైఫ్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే అవడం ఎంత కష్టమో నాకు తెలియదు, కానీ డైరెక్టర్ అవడం ఎంత కష్టమో తెలుసు. ఉపేంద్ర నా వద్ద చాలా సంవత్సరాలు పనిచేశాడు. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అతని కలను నిజం చేసిన కళ్యాణ్రామ్కు థ్యాంక్స్ సినిమా పెద్ద హిట్ కావాలి' అని శ్రీనువైట్ల తెలిపారు.
అల్లరి నరేష్ చెబుతూ, 'దర్శకుడు ఉపేంద్ర మంచి వ్యక్తి. మణిశర్మ పాటలు బాగున్నాయి. కళ్యాణ్కిది పెద్ద బ్లాక్బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'నేను, ఉపేంద్ర కలిసి పనిచేశాం. మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్. మంచి సినిమాను, మంచి హీరో, మంచి టీమ్తో చేయడం సులభం కాదు. సినిమాను వెనకుండి నడిపిస్తున్న వివేక్కు థ్యాంక్స్. కాజల్ మరిన్ని మంచి సినిమాల్లో నటించాలి. మంచి లక్షణాలున్న అబ్బాయికి మంచి ఉదాహరణ కళ్యాణ్ రామ్. ఆయన భవిష్యత్లో గొప్ప సినిమాలు చేయాలి. 'పటాస్' తర్వాత అదే ఎనర్జీ ఈ చిత్రంలో కనిపిస్తుంది. కచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నా' అని వంశీపైడిపల్లి తెలిపారు. దర్శకుడు ఉపేంద్ర మాధవ్ చెబుతూ,'ముందుగా కళ్యాణ్రామ్కు థ్యాంక్స్. ఆయన దర్శకుల హీరో. కథ చెప్పగానే ఓకే చేశారు. దర్శకుడిగా నాకు స్వేచ్ఛ ఇచ్చారు.ఏమీ తినకుండా 16 గంటలపాటు ఉండేవారు. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ఎంతో సపోర్ట్ చేశారు. మణిశర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాటలు ఎంత బాగా చేశారో, రీరికార్డింగ్ కూడా అంతే బాగా చేశారు. టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు' అని అన్నారు. 'పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. కళ్యాణ్ రామ్తో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాం' అని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజల్, సురేష్బాబు, జెమినీకిరణ్, పోసాని, భీమనేనిశ్రీనివాస్రావు, వి.ఎన్.ఆదిత్య, రవికిషన్, బ్రహ్మానందం, ఎం.ఎల్.కుమార్ చౌదరి, వివేక్, ఎన్.శంకర్, కోన వెంకట్, రామజోగయ్య శాస్త్రి, పృథ్వీ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.