Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాకు సంబంధించిన 24 విభాగాల్లో ఒకటైన లైట్మెన్స్ (తెలుగు సినీ అండ్ టీవీ అవుట్డోర్ లైట్మెన్ యూనియన్) సమ్మెకు దిగారు. తమ వేతనాలు పెంచాలంటూ గురువారం ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. అనధికారంగా కొన్ని రోజలుగా షూటింగ్లకు వెళ్ళడం లేదు. దీంతో చాలా వరకు సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. మూడేండ్లు గడిచి ఏడు నెలలు పూర్తయినా తమ వేతనాలు పెంచకపోవడంతో గురువారం నుంచి నిరసనకు దిగారు. తమకు రోజువారి వేతనాలు (బత్తా) పెంచాలని గత కొన్ని నెలలుగా ఫిల్మ్ ఛాంబర్కు ఫెడరేషన్ ద్వారా విన్నవించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో లైట్మెన్స్ ఎవరూ షూటింగ్లకు వెళ్ళకుండా నిరసన తెలుపుతున్నామని పలువురు లైట్మెన్స్ తెలిపారు.
దీనిపై అటు ఛాంబర్, ఇటు లైట్మెన్ యూనియన్ నాయకులకు మధ్య చర్చలు జరిగినా ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపకపోవడం, కాలయాపన, వేచిచూసే ధోరణి అవలంబించడంతో సమ్మెకు దిగుతున్నట్టు లైట్ మెన్ యూనియన్ నాయకులు చెబుతున్నారు.
'వేతనాలు పెంచడం, ఆఫ్ కాల్షీటును రద్దు చేయడం, డబుల్ కాల్షీటు పెట్టడం, ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన లైట్ మెన్స్ను తీసుకోవడం తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో ముందుకు వెళ్తున్నాం. మా వేతనం రోజుకు ప్రస్తుతం రూ.800 ఉంది. మూండేండ్లకు ఓసారి పెంచాలి. ఇప్పటికే ఏడు నెలలు దాటినా ఛాంబర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళాం. అయినా చేద్దామంటూ కాలయాపన చేస్తున్నారు. ఛాంబర్కి, ఫెడరేషన్కి నోటీసు కూడా పంపాం. ఇటీవల చర్చలు జరిపారు. కేవలం 20, 25 శాతం మాత్రమే పెంచుతామంటున్నారు. మేం 50 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. గత 15 రోజులుగా చర్చలు జరుగుతున్నా ప్రయోజనం లేదు. దీంతో గురువారం సమ్మెకు దిగాం. దీనికితోడు ఆఫ్ కాల్షీటును రద్దు చేయమంటున్నాం. సాయంత్రం 6 గంటల తర్వాత 9 వరకు పనిచేస్తే ఆఫ్ కాల్షీటు ఇస్తారు. కానీ 9గంటల కంటే ఎక్కువగానే మాతో పని చేయించుకుంటున్నారు. నైట్ కాల్షీటు వల్ల రెండు రోజులు (ఒక రోజు వేస్ట్ అవుతుంది) పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి గతంలో ఉన్న డబుల్ కాల్షీటును తిరిగి ప్రవేశ పెట్టాలని కోరుతున్నాం. అందుకు ఛాంబర్ పెద్దలు ఒప్పుకోవడం లేదు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన లైట్ మెన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మాకు రూ.800 ఇస్తే వారికేమో 2 వేల నుంచి 2,500 ఇస్తున్నారు. వారికిచ్చే బదులు మాకు వేతనాలు పెంచితే మేమే ఇంకా బాగా పనిచేస్తాం కదా అని బాలు అనే లైట్ మెన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'అవుట్ డోర్ షూటింగ్లున్నప్పుడు 320 కిలోమీటర్ల దూరం వెళితే ఒక కాల్షీటు, అంతకు మించి వెళ్లితే మరో కాల్షీటు, ప్రతి 320 కిలోమీటర్ల దూరానికి ఒక కాల్షీటు పెరిగేలా గతంలో ఫెడరేషన్ చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు అలా ఇవ్వడం లేదు. షూటింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు నాలుగు రోజులు వెళ్ళినా ఒకటి, రెండు కాల్షీట్ల డబ్బులే ఇస్తున్నారు. దీంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం. అలాగే లంచ్ బ్రేక్ లేకుండానే షూటింగ్లు చేయించుకుంటున్నారు. ఇది కూడా మారాలి. పైగా సమ్మె చేస్తుంటే పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారు. రామ్చరణ్ సినిమా షూటింగ్కు ముంబయి నుంచి వచ్చిన లైట్ మెన్లకు మా సమస్య చెప్పి, మాకు సహకరించాలని ఫెడరేషన్ ఆఫీసులో కూర్చొబెడితే, వారిని కిడ్నాప్ చేశారంటూ మా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. ఇది ఛాంబర్ పెద్దలు ఆడుతున్న నాటకం. పైగా ఛాంబర్లో పదవుల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు సినిమాలు నిర్మించడం లేదు. సినిమాలు నిర్మించని వారు అధికారంలో ఉండే హక్కు ఎక్కడిది?, శాంతియుతంగా సమ్మె చేస్తున్న మమ్మల్ని పోలీసులతో తరిమి కొడుతున్నారు. మాకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా' అని పలువురు లైట్మెన్స్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.
30 శాతం పెంచడానికి రెడీ..
దీనిపై ఫిల్మ్ ఛాంబర్కు చెందిన నిర్మాతలు దామోదర ప్రసాద్, రాందాసు స్పందించారు. 'సమ్మెకు దిగుతున్నట్టు మా(ఛాంబర్)కు ఎలాంటి నోటీసులు అందలేదు. ప్రస్తుతం వారి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి. గత వారం రోజులుగా దీనిపై చర్చలు జరుపుతున్నాం. ఆ చర్చలు కొలిక్కి వచ్చే టైమ్లో నిరసనకు దిగడం సరైనది కాదు. చర్చలు విఫలమయితే ముందుగా నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత సమ్మె చేయాలి. అవేమీ చేయకుండా సమ్మె చేయడం తగదు. అయితే వేతనాలు 30శాతం పెంచేందుకు మేం సిద్ధంగా. ఈ రోజు దీనిపై నిర్ణయం తీసుకున్నాం. ఫైనల్ అయిపోయింది. ఒకేసారి 50శాతం పెంచడం సాధ్యం కాదు. ఇండియన్ లేబర్ యాక్ట్ ప్రకారం మన సినీ కార్మికుల వేతనాలు మూడు రెట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇక హాఫ్ కాల్షీటు తీసేయడమనేది సాధ్యం కాదు. అది తొలగించి డబుల్ కాల్షీటు ఇస్తే నిర్మాతలకు భారమైపోతుంది. ఇతర భాషల లైట్ మెన్లను తీసుకురావడమనేది నిర్మాతల ఇష్టం. దేశంలో ఎవరు ఎక్కడైనా పనిచేసుకునే హక్కు ఉంది. మన వారు కరెక్ట్గా పనిచేస్తే ఇతరులను తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది మన వారి మంచి కోసం చేస్తాం. ఛాంబర్లోని 23 క్రాఫ్ట్ల వారిని లేని ఇబ్బంది లైట్మెన్స్కే ఎందుకు?. కొందరు ఆడిస్తున్న డ్రామాలో సాధారణ లైట్మెన్లు బలవుతున్నారు' అని చెప్పారు.