Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిషేక్, అభి, డి.ఆకాష్, అనూష వేణుగోపాల్ హీరోహీరోయిన్లుగా పరకోటి బాలాజి దర్శకత్వంలో ఎన్సీసీ సమర్పణలో, దృవ ఆర్ట్స్ ఫిల్మ్స్ పతాకంపై దృవచరణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఒక రాధ ముగ్గురు కృష్ణులు'. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాసు మాట్లాడుతూ, 'సినిమాను ఎంత కష్టపడి నిర్మించినా అది బాగుంటేనే ఆదరణ పొందుతుంది. ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. చిన్న సినిమాలకు మా ఫిల్మ్ ఛాంబర్ సపోర్ట్ ఉంటుంది. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'గతంలో కమల్ హాసన్ నటించిన 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలి' అని నిర్మాత, పీఆర్వో సురేష్ కొండేటి తెలిపారు. మరో అతిథి శ్రీరంగం సతీష్ కుమార్ మాట్లాడుతూ, 'దర్శకుడు బాలాజీపై నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చిన్న సినిమా కాదిది, మంచి చిత్రం. గతంలో 'జంబలకిడి పంబ', 'చిత్రం భళారే విచిత్రం' చిత్రాలు మంచి కథ, కథనంతో హిట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా మంచి కథ, కథనంతో అనుకున్న బడ్జెట్లో నిర్మించాం. సినిమా చాలా బాగా వచ్చింది. విజయవంతం కావాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'ఈ కథ నచ్చడంతో శ్రీరంగం సతీష్ కుమార్ సహకారంతో కొత్త వాళ్ళతో సినిమా చేశాం. మంచి రొమాంటిక్ కామెడీగా, యూత్ఫుల్గా సినిమాను తెరకెక్కించాం. జూన్లో విడుదల చేయనున్నాం' అని చిత్ర దర్శకుడు బాలాజీ తెలిపారు. సంగీత దర్శకుడు జయసూర్య చెబుతూ, 'గతంలో 25 చిత్రాలకు సంగీతం అందించా. ఈ సినిమాలో మూడు పాటలున్నాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనుష, మోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.