Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విప్లవ చిత్రాల నటుడు, దర్శక, నిర్మాత 'రెడ్స్టార్' మాదాల రంగారావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శనివారం సాయంత్రం ఆయన శ్వాసకోశ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఆయనకు చిక్సిత అందిస్తున్నారు. మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి గురించి తనయుడు, నటుడు మాదాల రవి తెలియజేస్తూ, 'గతేడాది మే నెలలో నాన్నగారికి తీవ్ర గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేర్పించాం. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రికి తరలించాం. డా||గోపీచంద్ బృందం చాలా క్రిటికల్ హార్ట్ ఆపరేషన్ చేసి నాన్నగారిని కాపాడారు. అప్పట్నుంచి డా||రమేష్, డా||గోపీచంద్, డా||అనురాధల పర్యవేక్షణలో హైదరాబాద్లోనే వైద్యం అందిస్తున్నాం. నాన్నగారు శనివారం మరోసారి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్టార్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం వెంటిలేటర్పైనే ఆయనకు శ్వాసను అందిస్తున్నారు. అలాగే డయాలసిస్కు సంబంధించి ఐ.సి.యులో ఉంచారు. డాక్టర్ల బృందం నాన్నగారిని రక్షించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో 48 గంటలు పరిస్థితి విషమంగానే ఉంటుందని డాక్టర్లు చెప్పారు' అని రవి తెలిపారు. మాదాల రంగారావుకు భార్య పద్మావతి, కుమారుడు డా||మాదాల రవి ఉన్నారు. మాదాల రంగారావు 'చైర్మన్ చెలమయ్య', 'యువతరం కదిలింది', 'మరో కురుక్షేత్రం', 'మహాప్రస్థానం', 'నవోదయం', 'విప్లవ శంఖం', 'బలిపీఠంపై భారతనారి', 'తొలిపొద్దు', 'ఎర్ర సూర్యుడు', 'ఎర్రపావురాలు', 'జనం జనం', 'ప్రజాశక్తి', 'ఎర్ర మల్లెలు', 'స్వరాజ్యం' వంటి విప్లవాత్మక చిత్రాల్లో విప్లవ నాయకుడిగా నటించి మెప్పించారు. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని విప్లవాత్మక చిత్రాల నిర్మాణానికి నాంది పలికిన ప్రముఖుల్లో మాదాల రంగారావు ఒకరు.