Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు నవలా ప్రపంచంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఆంధ్రుల అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి (78) ఇక లేరు. కాలిఫోర్నియాలోని కుపర్టినోలో (భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం) నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని, అంత్యక్రియలను కాలిఫోర్నియాలోనే నిర్వహించ నున్నట్టు ఆమె కుమార్తె శైలజ తెలిపారు. నవలా రాణిగా పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన యద్దనపూడి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దాదాపు మూడు దశాబ్దాలకుపైగా నవలా రచనలో మకుటం లేని మహారాణిగా, విశేష పాఠకాదరణ పొందిన ఏకైక మహిళా రచయిత్రిగా యద్దనపూడి నిలిచారనడంలో అతిశయోక్తి లేదు. మధ్య తరగతి అమ్మాయిల జీవన చిత్రాన్ని, వారి వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని, హుందాతనాన్ని, మాటకారి తనాన్ని తన నవల్లోని కథానాయికలగా ద్వారా ప్రపంచానికి చాటిన వైనం, మనుషుల జీవితాలే కథా వస్తువులుగా, వారి ప్రేమలు, బంధాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ అనుబంధాలకు అక్షరరూపంగా రాసిన ఎన్నో రచనలు యద్దనపూడి సులోచనా రాణిని నవలా ప్రపంచంలో రాణిగా నిలబెట్టాయి. ముఖ్యంగా నవలల్లో
ఆమె వర్ణించే తీరు అత్యద్భుతం. 1970 దశకంలో ఆమె రాసిన ఎన్నో రచనలు పాఠకలోకాన్నే కాదు వెండితెర ప్రేక్షకుల్ని సైతం అలరించాయి. ఇక సీరియళ్లు, ధారావాహికల రూపంలో ఆమె రచనలు బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాయి. 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండంలోని కాజ గ్రామంలో జన్మించిన యద్దనపూడి సులోచనా రాణి తొలిసారిగా 'చదువుకున్న అమ్మాయిలు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు.
1965లో 'మనుషులు - మమతలు' చిత్రానికి కథ అందించారు. ఆ తర్వాత 'మీనా', 'జీవన తరంగాలు', 'సెక్రటరీ', 'రాధాకృష్ణ', 'అగ్నిపూలు', 'చండిప్రియ', 'ప్రేమలేఖలు', 'విచిత్రబంధం', 'బంగారు కలలు', 'జై జవాన్', 'కాంచనగంగ', 'గిరిజా కళ్యాణం', 'ఆత్మీయులు' వంటి నవలలు దాదాపు అవే పేర్లతో వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి.
వీటిల్లో చాలా చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొంది అఖండ విజయం సాధించాయి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకెవ్వరూ సాటిలేరని ఆయా చిత్రాల ద్వారా యద్దనపూడి నిరూపించుకున్నారు.
యద్దనపూడి రాసిన 'మీనా' నవలకు విజయనిర్మల దర్శకురాలిగా వెండితెర రూపమిచ్చారు. కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈచిత్రం 1973లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే నవలను స్ఫూర్తిగా తీసుకుని ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అ..ఆ' చిత్రాన్ని తెరకెక్కించిన విషయం విదితమే. శోభన్బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ, చంద్రమోహన్, లక్ష్మీ, గుమ్మడి, అంజలిదేవి,
శ్రీ రంజని వంటి హేమాహేమాలతో తాతినేని రామారావు రూపొందించిన 'జీవన తరంగాలు' చిత్రం కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇదే చిత్రాన్ని హిందీలో 'దిల్ ఔర్ దీవార్', కన్నడలో 'మాంగల్య'గా రీమేక్ చేశారు. కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సెక్రటరి' చిత్రం అప్పట్లో తెలుగు చిత్ర సీమను ఓ ఊపు ఊపేసింది. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా రామానాయుడు నిర్మించిన చిత్రమిది. నవలగానే కాకుండా సినిమా రూపంలోనూ 'సెక్రటరీ' సంచలనం సృష్టించడం విశేషం. యద్దనపూడి రాసిన తొలి నవల 'సెక్రటరీ' కావడం మరో విశేషం. కె.బాపయ్య దర్శకత్వంలో కృష్ణంరాజు, జయప్రద, జయసుధ నాయకానాయికలుగా నటించిన 'అగ్నిపూలు', ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన 'బంగారు కలలు', కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఆత్మగౌరవం' వంటి తదితర చిత్రాలు మరపురాని చిత్రాలుగా నిలిచాయి.
అలాగే 'ఆగమనం', 'అగ్నిపూలు', 'కెరటాలు', 'సుకుమారి', 'ఋతురాగాలు', 'నీరాజనం', 'రుతుగీతం' వంటి కథలు ధారావాహికలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.
'ఆరాధన', 'ఆత్మీయులు', 'అభిజాత', 'అభిశాపం', 'ఆహుతి', 'అమర హృదయం', 'అనురాగ గంగ', 'అనురాగ తోరణం', 'అర్థస్థిత', 'ఆశల శిఖరాలు', 'అవ్యక్తం', 'ఋతువులున్నాయి', 'కలల కౌగిలి', 'కీర్తికిరిటాలు', 'కృష్ణ లోహిత', 'గిరిజా కళ్యాణం', 'చీకటిలో చిరుదీపం', 'జీవన సౌరభం', 'జాహ్నవి', 'దాంపత్యవనం', 'నిశాంత', 'ప్రేమ', 'ప్రేమ దీపిక', 'ప్రేమ పీఠం', 'బహుమతి', 'బంగారు కలలు', 'మనోభిరామం', 'మౌనతరంగాలు', 'మౌనపోరాటం', 'మౌనభాష్యం', 'మోహిత', 'వెన్నెల్లో మల్లిక', 'విజేత', 'శ్వేత గులాబి', 'సెక్రటరీ', 'సౌగంధి', 'సుకుమారి' వంటి తదితర నవలా రచనలు ఆబాలాగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
'సెక్రటరీ' నా మానస పుత్రిక..
'నా తొలి తెలుగు నవల 'సెక్రటరి'. తెలుగు నవలా చరిత్రలో అదో ఉత్తంగ తరంగం. అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు. అప్పుడే నాకు పాప పుట్టింది. తల్లిగా కొత్త అనుభూతి. ఉక్కిరిబిక్కిరి అయ్యే సంతోషం. ప్రపంచంలో ఈ మాతృత్వపు సంతోషానికి ఇక ఏదీ సాటి రాదు అని నమ్మాను. ఇంకో కొత్త సంతోషం.. నాకు మా అమ్మాయితోపాటు 'సెక్రటరీ' నవల కవల పిల్ల అన్నట్టుగా నా హృదయంలోకి వరదలా వచ్చేసింది. ఆ నవలకి వచ్చిన పాపులారిటీ, ప్రశంసలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏకకాలంలో రెండు అద్వితీయమైన ఆనందాలు నా హృదయాన్ని పులకరింప జేశాయి. ఒకటి మా అమ్మాయి, రెండోది 'సెక్రటరీ' నవల'.
- యద్దనపూడి సులోచనా రాణి