Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొందిన 'మహానటి' సినిమాను చూసి జెమినీ గణేశన్ మొదటి భార్య కుమార్తె కమల చిత్ర యూనిట్పై మండ ిపడుతున్నారు. తన తండ్రిని విలన్లా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చాలా మంచివారని, సావిత్రికే ఆయనంటే ఇష్టం లేదన్నారు. పాత పత్రికలను ఓసారి గమనిస్తే, అప్పటి పత్రికల్లో వచ్చిన కథనాలు, ఇంటర్వ్యూలు వంటివి చూస్తే...
జెమిని గణేశన్్ 'మహానటి'లో చూపించిన దానికంటే...పెద్ద విలన్ అని అర్థమవుతుంది. సావిత్రి మొదటి సంస్మరణ సందర్భంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడిన విషయాలు ప్రచురితమైన ఓ పాత పత్రిక కటింగ్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో ఆమె చెప్పినవి చూస్తే....జెమినీ గణేశన్ పాత్రను వివాదాస్పదం చేయడం ఇష్టంలేక, ఆయన పాత్రను కొంచెం పాలిష్డ్గా సినిమాలో చూపించినట్లు అనిపిస్తుంది.
సావిత్రి మొదటి సంస్మరణ రోజు విజయ చాముండేశ్వరి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...'మా అమ్మ సావిత్రి చనిపోయేనాటికి కటిక పేదరికంలో ఉన్నట్లు వచ్చిన వార్తలన్ని అవాస్తం. ఆమె మరణించే సమయానికి రూ.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఆమె వద్ద ఉన్నాయి. ఆమె కోమాలో ఉన్నప్పుడే వీటన్నింటీ కైంకర్యం చేశారు. కొడైకెనాల్, హైదరాబాద్లోని ఇళ్ల గురించి తెలియకుండా దాచిపెట్టడానికి మా తండ్రి ప్రయత్నిస్తున్నారు. మా అమ్మ బతికి ఉన్నప్పుడు ఆమెను మానసికంగా ఎంతో క్షోభకు గురిచేసినా తండ్రిగా ఆయనపై ఉన్న మమకారంతో సర్దుకుపోయాం. ఒక్కోసారి ఆయన పక్షం వహించి నేనూ అమ్మని క్షోభపెట్టాను. సావిత్రిని కొరడాతో కొట్టి దారిలో పెట్టివుండాల్సిందని నాన్న జెమినీ గణేశన్ మాట్లాడారు. దీన్ని అభిమానులే జీర్ణించుకోలేరు. ఇక కూతురుగా నేను ఎలా తట్టుకోగలను?, తల్లిని పోగొట్టుకున్న నన్ను పలకరించడానికి తండ్రి రాలేదన్నారు. తమ్ముడి కోసం ఓసారి ఇంటికి వెళితే...తీవ్రంగా అవమానించారు. అమ్మ చనిపోయేనాటికి ఆదాయ పన్ను శాఖకు కట్టాల్సిన రూ.10 లక్షల కోసం అప్పటికి మిగిలివున్న మూడు ఇళ్లనూ గణేశన్ అటాచ్ చేయించి మాకు ఇల్లు లేకుండా చేశారు. ఆమె బాగా సంపాదిస్తున్నప్పుడు హరించింది చాలక....ఆమె కోమాలో ఉండగా లక్షల రూపాయలు కైంకర్యం చేశారు. మా అమ్మ వైద్యం కోసం విరాళాల రూపంలో వచ్చిన డబ్బును కూడా స్వార్థానికి వాడుకున్నారు. అమ్మ బతికి ఉండగానే, నాన్న కాశీకి వెళ్ళి తర్పణం వదిలొచ్చారు. మా అమ్మ అస్థికలను నిమజ్జనం చేయడానికి తమ్ముడ్ని పంపడానికి కూడా నిరాకరించారు. ఇక చేసేది లేక నా భర్తతోనే ఆ పని చేయించాను. తన పెద్ద కుమార్తె కమల మెడికల్ కాలేజీ చదువు కోసం అమ్మ తన మెడలోని రవ్వల హారం ఇవ్వలేదన్న కోపంతో పళ్లు ఊడేలా నాన్న కొట్టారు' అని సంతాప సభలో కన్నీటి పర్యంతమయ్యారు.
పై విషయాలను గమనిస్తే 'మహానటి' టీం జెమినీ గణేశన్ గురించి సరిగా అధ్యయనం చేయలేదనిపిస్తోంది. అధ్యయనం చేసినా వివాదాల జోలికి వెళ్లకూడదన్న భావనతో గణేశన్ పాత్రను పైపైనే చూపించారనిపిస్తోంది. గణేశన్ కుమార్తె డాక్టర్ కమలా సెల్వరాజ్ తన తండ్రిని విలన్లాగా చూపించారని అంటున్నారుగానీ....వాస్తవంగా గణేశన్ పాత్రను కూడా పాజిటివ్గానే చూపించారు. సావిత్రి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిగా జెమినీ కనిపిస్తారు. చివరిదాకా ఆమెపై ఎనలేని ప్రేమ ఉన్నట్లూ కూడా చూపిస్తారు. సావిత్రి మరణ సమయంలో జరిగిన ఘటనలు (చాముండి చెప్పిన దానిబట్టి) చూస్తుంటే గణేశన్ చాలా అమానవీయంగా, బాధ్యతారహితంగా, అవకాశవాదంగా ప్రవర్తించినట్లు తేలుతుంది. గణేశన్్ పెళ్లి అయిన తరువాత కూడా సావిత్రిని, మరో మహిళను వివాహం చేసుకోవడాన్ని ఓ ఇంటర్వ్యూలో కమలను ప్రశ్నిస్తే...ఆమె నిస్సంకోచంగా సమర్థించారు. తన తండ్రి అందగాడని, అందుకే అందరూ ఆయన వెంటపడ్డారని చెప్పుకొచ్చారు. కమల సినిమా చూసి ఊరకే ఉండివుంటే...సావిత్రి అభిమానులు పాత పత్రికలను తవ్వి తీసి వాస్తవాలను బయటపెట్టేవారు కాదు. సినిమాలో చూపించినంత వరకే గణేశన్ పాత్ర పరిమితం అయ్యేది. కమల తండ్రి చాలా మంచోడని వెనకేసుకుని రావడం వల్ల వాస్తవాలేమిటో చెప్పే పాత విశేషాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నారు.
'మహానటి'పై జెమినీ కుమార్తె కమల అభ్యంతరం..
'మహానటి' సినిమా ఈనెల 11న 'నడిగర తిలకం' పేరుతో తమిళంలో విడుదలైంది. ఆ సినిమా చూసిన జెమినీ గణేశన్ మొదటి భార్య కుమార్తె డా|| కమలా సెల్వరాజ్ తీవ్రంగా మండి పడు తున్నారు. తమ తండ్రి జెమినీ గణేశన్ గురించి తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తల్లి అంటే జెమినీ గణేశన్్కు ప్రేమే లేదన్నట్లు చూపించారని, ఈవిధంగా ఎలా చెబుతారని ఆమె చిత్ర యూనిట్ను నిలదీస్తున్నారు. జెమినీ గణేశన్ అంటే సావిత్రికి ఇష్టం ఉండేది కాదని చెప్పారు.ఒకసారి తాము అమ్మ సావిత్రి ఇంటికి వెళితే పెంపుడు కుక్కలను తమపైకి వదిలారని ఆమె ఆరోపించారు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీ గణేశన్్ అనేలా చూపించారని, అందులో అర్థంలేదన్నారు. సావిత్రి కష్టాల్లో ఉంటే ఎవరూ పట్టించుకోలేదనడం సరికాదన్నారు. కమల ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె జెమినీ గణేశన్, అలిమేలు దంపతుల కుమార్తె. దక్షిణాదిన తొలి టెస్ట్ట్యూబ్ బేబీని సృష్టించిన వైద్యురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అమ్మ సావిత్రికి నాన్నంటే ఇష్టం లేదనే ఆశ్చర్యకరమైన విషయాన్నీ కమల వెల్లడించారు. తండ్రిని వెనకేసుకొచ్చిన కమలపై సావిత్రి అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
- ఆదిమూలం శేఖర్ (తిరుపతి)