Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాదేవ్, మమతా సాహాస్, సునైన హీరో, హీరోయిన్లుగా ఋషికృష్ణ దర్శకత్వంలో జోడి బ్రదర్స్ పతాకంపై అభిరామ్ నిర్మిస్తున్న చిత్రం 'నివురు'. ఈ చిత్ర ట్రైలర్, లోగో లాంచ్ గురువారం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన 'మా' అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా ట్రైలర్ను, లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ, 'హీరో మహాదేవ్ చిన్నప్పట్నుంచి తనకిష్టమైన హీరోల పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనికి సినిమాలంటే పిచ్చి. కష్టపడి సినిమా చేశారు. ఇది విజువల్గా, సంగీత పరంగానూ అద్భుతంగా ఉంది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'మంచి కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం విజయం సాధించి, సినిమా కోసం టీమ్ పడిన కష్టానికి ఫలితం దక్కాలి' అని నటుడు కాశీ విశ్వనాథ్ తెలిపారు. హీరో మహాదేవ్ చెబుతూ, 'సినిమా అంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. చదువు అబ్బలేదు. సినిమా మీద ప్యాషన్తో మొదట రజనీకాంత్, ఎన్టీఆర్ పేర్లను బాడీపై పచ్చబొట్లు పొడిపించుకున్నా. ఎన్నో కష్టాల కోర్చి ఇంటిని అమ్మి సినిమా తీశాం. ఎనిమిదేండ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. తమ్ముడు అభిరామ్ సపోర్ట్గా నిలిచాడు. సినిమా మధ్యలో ఆగిపోతే ఎవరూ ఆదుకోలేదు. అంతా విమర్శించారు. ఎలాగైనా సినిమాను విడుదల చేయాలని ఏడాదిన్నరపాటు ఆటో నడిపి 16 లక్షలు సంపాదించి ఇక్కడి వరకు తీసుకొచ్చాం. వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.
మా ప్రయత్నాన్ని ఆదరించాలని, మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'నిర్భయలాంటి ఎంతో మంది ఆడవాళ్ళపై జరిగిన, జరుగుతున్న అఘాయిత్యాలను ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రమిది. లవ్, యాక్షన్తోపాటు సందేశం కూడా ఉంటుంది' అని నిర్మాత అభిరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైమండ్ రత్నబాబు, ఎం.ఎల్.రాజా, అభి ఉప్పల, ఎం.వి.కె.మల్లిక్, రత్నశేఖర్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలియజేశారు.