Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఐపీసీ సెక్షన్లోని కొన్ని చట్టాలను ఆసరాగా చేసుకుని కొంత మంది మహిళలు మగవాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మగవాళ్ళకు రక్షణ కావాలనే కథాంశంతో 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' చిత్రాన్ని తెరకెక్కించాం' అని నిర్మాత ఆలూరి సాంబశివరావు అన్నారు. శరశ్చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' చిత్రాన్ని ఆలూరి సాంబశివరావు నిర్మించారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఆలూరి సాంబశివరావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'మా మేనమామ సినిమాల్లో ఉండటంతో నేను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నాను.
కెమెరామెన్ కావాలని కలలు కన్నాను. మామయ్య రాణించలేకపోవడం, ఓ నెల రోజులు సినిమాల్లో తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో నాకిది సెట్ కాదని వెళ్ళిపోయాను. రిటైర్ అయ్యాక ఇండిస్టీలోకి అడుగుపెట్టి ఇప్పటికే రెండు సినిమాలను నిర్మించాను. 'చెంబు చిన సత్యం' ఆదరణ పొందలేదు. 'నేనే ముఖ్యమంత్రి' ఇంకా విడుదల కాలేదు. మూడో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. రెండవ చిత్రం ఇంకా విడుదల కాకపోయినా మూడో సినిమాపై నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఐపీసీ సెక్షన్లో ఓ సెక్షన్ను తీసుకుని సమాజంలోని సమస్యలను ఎత్తిచూపుతూ ఫ్యామిలీ ఆడియెన్స్కు ఆకట్టుకునే విధంగా, ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కించారు. ఆమని గెస్ట్ రోల్లో ఆకట్టుకుంటారు. శరశ్చంద్ర హీరోగా చాలా బాగా నటించారు. నేహాదేశ్ పాండే నటన, అందం అలరిస్తుంది. నటీనటులంతా ఆయా పాత్రలో జీవించారు. విజరు కురాకుల సంగీతం మరో అసెట్. మౌనశ్రీ మల్లిక్ ఏడు పాటలకు మంచి సాహిత్యాన్ని అందించారు. గత సినిమాల అనుభవంతో సినిమాను అనుకున్న బడ్జెట్లో తీశాం. అందుకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. అందుకే ఈ నెల 29న చాలా సినిమాలున్నప్పటికీ కథపై నమ్మకంతో విడుదల చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.