Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరోయిన్గా నటించడం చాలా పెద్ద టాస్క్. అమ్మాయిలు అబ్బాయి తరహా డ్రెస్లు వేసుకోవచ్చు. కానీ మగాళ్ళు ఆడవాళ్ళలా వారి దుస్తులు ధరించడం చాలా కష్టం' అని అంటున్నారు హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'జంబలకిడి పంబ'. జె.బి.మురళీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, 'బాడీ స్వాప్ అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా అనిపించింది. ఈ కథను దర్శకుడు ముందు నాని, శర్వానంద్కు సెట్ అయ్యేలా లవ్ స్టోరీ రాసుకున్నారు. నాకు కథ చెప్పాక కొన్ని మార్పులు చేశారు. లేడీస్గా నటించాలన్నప్పుడు రాజేంద్రప్రసాద్, చిరంజీవి, నరేష్ వంటి వారు మహిళలుగా నటించిన సినిమాలు చూశా. ఇంట్లో మా వైఫ్ నైటీ వేసుకుని ఎలా ఉంటానో చూసుకున్నాను. అది చూసి మా అమ్మాయి ఛమేలీ రాణి వచ్చిందని కామెంట్ చేసింది (నవ్వుతూ). నేను హీరోగా చేసి మళ్ళీ ఇతర సినిమాల చిత్రీకరణలో పాల్గొనేటప్పుడు ఆ హీరోలు, దర్శకులు, ఇతర ఆర్టిస్టులంతా కలిసి మనది మల్టీస్టారర్ అంటూ ఆటపట్టించే వాళ్ళు. ఈవీవీగారి 'జంబలకిడి పంబ'లో ఓ గ్రామం మొత్తం ఆడాళ్ళు మగాళ్ళుగా, మగవాళ్ళు ఆడవారిగా మారతారు. ఇందులో హీరోహీరోయిన్లు మాత్రమే మారతారు. అదీ కూడా జంబలకిడి పంబ అనే మంత్రం ద్వారా. మరి అలా ఎందుకు మారారనేది సినిమా. మహిళగా నటించడం బాగుంది, కానీ డ్రెస్సులు ధరించడం ఇబ్బందిగా అనిపించేది. జంబలకిడి పంబ మంత్రాన్నే టైటిల్గా పెడితే బాగుంటుందని అదే సినిమా పేరుగా పెట్టాం. కానీ సినిమా పూర్తయిన తర్వాత టైటిలే మాకు బ్రాండ్గా ఉపయోగపడింది. అయితే ఈ టైటిల్ అన్నప్పుడు కాస్త భయమేసింది. అయినప్పటికీ పాత సినిమా పరువు తీసేదిగా మాత్రం మా సినిమా ఉండదు. సిద్ధి ఇద్నాని మగవాళ్ళలా బాగా నటించారు. ట్రైలర్ చూసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. బేసిక్గా నాకు మహిళలంటే ముందునుంచి గౌరవం ఉంది. అది ఈ చిత్రం ద్వారా ఇంకా పెరిగింది. మహిళా సమస్యలను ఇందులో వినోదాత్మకంగా చర్చించాం. కచ్చితంగా మహిళా ఆడియెన్స్కు బాగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తీశారు. ఈ సినిమా హీరోగా నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందనుకుంటున్నా.
హీరోగా చేసినంత మాత్రాన కామెడీ పాత్రలు వదిలేయడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'అరవింద సమేత', 'ఎఫ్2', 'అమర్ అక్బర్ ఆంటోని', 'పంతం' చిత్రాల్లో నటిస్తున్నాను. 13 మంది హాస్య నటులందరం కలిసి ఓ బ్యానర్ను స్థాపించి 'భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు' పేరుతో సినిమా తీయాలనుకుంటున్నాం. మా యూనిటీ కోసం చేసే ప్రయత్నమిది. నేను హీరోగా నటించే సినిమా మంచి టాక్ వస్తే కాదు, మంచి కథ వస్తే హీరోగా నటిస్తాను. ప్రస్తుతం శ్రీనివాస్ అనే నూతన దర్శకుడి సినిమాలో హీరోగా నటించబోతున్నాను. ఎన్టీఆర్తో విభేదాలనే వార్తల్లో వాస్తవం లేదు. అందుకే ఇటీవల ఎన్టీఆర్తో సెల్ఫీ తీసి పోస్ట్చేశా. ఎన్టీఆర్ మనకంటే చాలా ముందుంటారు. చిన్న విషయాలను అస్సలు పట్టించుకోరు' అని అన్నారు.