Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్బాబు, అదితి రావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సమ్మోహనం'. ఇటీవల విడుదలైన సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సుధీర్బాబు మాట్లాడుతూ, 'నన్ను సాధారణ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రమిది. 'ప్రేమ కథా చిత్రమ్' తర్వాత చాలా మంచి సినిమాలు చేశా, కానీ అంతా నన్ను 'ప్రేమ కథా చిత్రమ్' సుధీర్గా పిలిచేవారు. 'సమ్మోహనం' వాటన్నింటిని తుడిచేసింది. ఇకపై అంతా 'సమ్మోహనం'సుధీర్బాబు అని పిలుస్తారు. మహేష్కు బావగా నేను దగ్గరే కానీ, నటుడిగా మా మధ్య గ్యాప్ ఉండేది. ఈ చిత్రం నన్ను దగ్గర చేసింది. ఇప్పుడు నా గురించి చెప్పేటప్పుడు ఆయన కళ్లలో ఓ మెరుపు కనిపిస్తుంది. ఇంత మంచి సినిమా ఇచ్చిన ఇంద్రగంటికి థ్యాంక్స్. ఆయన భాషను ప్రేమించేంతగా భార్యను కూడా ప్రేమించరు. నిర్మాత కృష్ణప్రసాద్ ఉక్కు మనిషి. సినిమా ప్రారంభం నుంచి కృష్ణగారు, చిరంజీవి, మహేష్ ఎంతో సపోర్ట్ చేశారు. నరేష్ను సినిమా చేసే సమయంలో నిజమైన నాన్నగానే భావించి చేశా. సినిమాకు కలెక్షన్లు బాగున్నాయి. ఓవర్సీస్లో హాఫ్ మిలియన్ సాధించింది. మొత్తంగా మిలియన్ డాలర్లను కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నాం. సపోర్ట్ చేసిన అదితి, పవిత్రాలోకేష్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లకు థ్యాంక్స్' అని అన్నారు.
'నాపై, కథపై నమ్మకంతో నిర్మాత కృష్ణప్రసాద్ సినిమా నిర్మించారు. ఆ నమ్మకంతో ఈరోజు వరకు ఆయన సినిమా చూడలేదు. కథ వినగానే ఒప్పుకుని, ఛాలెంజింగ్గా తీసుకుని నటించిన సుధీర్బాబుకు థ్యాంక్స్. అదితి, సుధీర్ పోటీపడి నటించారు. కెమెరామెన్ పి.జి.విందా నా కళ్లు. తను అమ్మాయి అయితే పెళ్ళి చేసుకునేంత అనుబంధం మాది. నేను చెప్పిన వాటిని అర్థం చేసుకుని అందంగా తెరపై చూపిస్తుంటారు. 'పెళ్ళి చూపులు' సినిమాలో ఓ సన్నివేశం చూసి అరే! మనం కూడా ఇలా ఓ కథను రాస్తే బాగుంటుందనిపించి, ఆ స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నా. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అని దర్శకుడు ఇంద్రగంటి చెప్పారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, 'ఇంద్రగంటి మరోసారి మా బ్యానర్కు మంచి సినిమాను అందించారు. నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నా. ఇలాంటి మంచి సినిమాను చేసేందుకు కారణమైన సుధీర్బాబు, దర్శకులకు, టీమ్ అందరికీ థ్యాంక్స్' అని తెలిపారు. 'ఎలాంటి తప్పులు లేకుండా సినిమాలు రావడం అరుదు. అలాంటి అరుదైన చిత్రమిది. ఎపిక్ విజయం సాధిస్తుందని కథ విన్న రోజు నుంచి చెబుతున్నా. నేను అన్నట్టుగానే ఎపిక్ హిట్ అయ్యింది. చాలా రకాలుగా ఇన్స్పైర్ చేసింది. తెలుగు భాష గొప్పతనాన్ని ఓ సందేశంలా ఇచ్చింది. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాకెరీర్ బెస్ట్ సినిమా అని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ తరానికి ఇదొక 'మరో చరిత్ర'లాంటి సినిమా అని ఓ పెద్దాయన చెప్పడం మరిచిపోలేను' అని నరేష్ అన్నారు. 'నాలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఇంద్రగంటి స్ఫూర్తి. మరోసారి ఆయన మంచి సినిమాని అందించారు' అని దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వివేక్ సాగర్, హర్షిణి, పవిత్రాలోకేష్, రాహుల్ రామకృష్ణ, మార్తాండ్ కె.వెంకటేష్, పి.జి.విందా, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొని చిత్ర విజయానందాన్ని పంచుకున్నారు.