Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కళ ప్రపంచంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తుంటుంది. సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న యుగమిది. మోడ్రన్ కల్చర్ యువతను ఓ వైపు తీసుకెళ్తుంటే, కవులు, కళాకారులు మరో వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఆర్.నారాయణ మూర్తి అన్నీ తానై రూపొందించిన చిత్రం 'అన్నదాతా సుఖీభవ'. మేలో విడుదలైన సినిమాకు రైతుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు జులై 7న మరోసారి విడుదల చేస్తున్నారు. చిత్ర పాటలకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో గురువారం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన కీరవాణి చిత్ర బృందానికి షీల్డ్లను అందజేశారు.
కీరవాణి మాట్లాడుతూ, 'ఇండిస్టీలో గొప్ప లక్షణాలున్న వారు చాలా మంది ఉన్నారు. అవన్నీ ఒక్క నారాయణమూర్తిలో ఉన్నాయి. జనం బాగుండాలని కోరుకోవడం ఆయన బలహీనత, అదే ఆయన బలం. చిత్ర పరిశ్రమకు ఆయనొక శ్రేయోభిలాషి. ఈ సినిమా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వేసిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలాంటి సినిమాలను ఆదరించాలి. నారాయణమూర్తి జనం కోసం ఆలోచిస్తారు. నిరాడంబరంగా ఉంటారు, చాలా విషయాలు తెలుసు. కాబట్టి క్రియాశీల రాజకీయాల్లోకి వెళితే బాగుంటుంది' అని అన్నారు.
'ప్రపంచం, శరీరం ఒక పదార్థం. దానికి ఆహారం కావాలి. 70శాతం మంది రైతులు భూమిపై ఆధారపడి బతుకుతున్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఇప్పుడెలా ఉంది, అసలు రైతు అంటే ఎవరో సినిమా చూసి నేర్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా' అని గద్దర్ చెప్పారు. గోరెటి వెంకన్న చెబుతూ, 'కార్పొరేట్ ఆగడాలను, రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని, రైతుల సమస్యలను, వారి బాధలను ఈ చిత్రంలో చాలా సరళంగా ఆర్.నారాయణమూర్తి చూపించారు. ఆయనొక కర్మయోగి. సినిమాను కళాఖండంగా మలిచారు. మరోసారి విడుదలవుతున్న ఈ సినిమా 'ఎర్రసైన్యం' అంతటి విజయం సాధించాలి' అని చెప్పారు. 'వెండితెరపై గుండెతెరను ఆవిష్కరించే నారాయణమూర్తి తన సినిమాకు పాట రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మన్నుని అన్నం చేసే రైతుది 12వ అవతారం. పాలకులు, బహుళజాతి కంపెనీలు ప్రగతిపథం అంటూ రైతు వెన్నుపూస విరుస్తున్నారు. రైతు పండించే పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వెండితెర ప్రవాహం నారాయణమూర్తి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి' అని అందె శ్రీ చెప్పారు. జయరాజ్ మాట్లాడుతూ, 'వెండితెర గౌతమబుద్ధుతు ఆర్ నారాయణమూర్తి. ఆయన మన తెలుగు గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నాం' అని అన్నారు. 'తాను అనుకున్న ఆశయం కోసం ప్రయాణించే బహుదూరపు బాటసారి నారాయణమూర్తి. రైతు సమస్యల గురించి లోతుగా అధ్యయనం చేసి, విశాల హృదయంతో సమగ్ర జీవిత సంగ్రాహాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. తన ప్రతి సినిమాను కృతజ్ఞతా భావంతో తెరకెక్కించారు' అని సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, 'మే 18న సినిమాను విడుదల చేశా. వేసవిలో విడుదల చేయడం వల్ల మేం చూడలేకపోయాం. మంచి వాతావరణంలో రిలీజ్ చేస్తే ఎక్కువమంది రైతులు చూస్తారని ఓ రైతన్న చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకుని జులై 7న మరోసారి సినిమాను రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు అన్నదాతా సుఖీభవ కాదు, అన్నదాతా దుఖీభవ అయ్యింది. రైతన్న ఆత్మహత్య చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈ సినిమా తీశా. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే గిట్టుబాటు ధర కల్పించాలని చాలా కమిటీలు తెలిపాయి. 2004లో ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిటీ అదే సిఫార్సు చేసింది. దాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదు. కేసీఆర్ ఈ గిట్టుబాటు ధర కోసం కేంద్రంతో పోరాడాలి' చెప్పారు.