Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సినీ విమర్శకులు నందగోపాల్ కన్నుమూశారు. కొంత కాలంగా వయసురీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నందగోపాల్ తన 18వ ఏటనే దర్శకుడు గోపీచంద్ రూపొందించిన 'పేరంటాలు' చిత్రంపై నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి అందుకున్నారు. 1952లో పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు. తొలుత 'జ్వాల' పత్రిక సంపాదకులు కె.ప్రత్యగాత్మ వద్ద సహాయకునిగా పనిచేశారు. ఈ క్రమంలో సినిమా రంగంపై అవగాహన పెంచుకున్నారు. 67లో యునెస్కో సహకారంతో, ప్రపంచ ప్రసిద్ధ చలనచిత్ర చరిత్రకారిణి మేరీ సెటస్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణేలో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేశారు. 67 నుంచి 78 వరకు 'తెలుగుతెర', 'కినిమా' పత్రికల సంపాదకునిగా పనిచేశారు. 'సినిమా అక్షరాస్యత' వ్యాప్తికి కృషి చేశారు. 78 నుంచి 85వరకు సీబీఎఫ్సీ ప్రాంతీయ సలహామండలి సభ్యునిగా, అలాగే ఫిల్మోత్సవ్, బెంగుళూరు ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 85 నుంచి 87 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు వెలుగు పత్రికకు తొలి సంపాదకుడిగా వ్యవహరించారు. 90లో సీబీఎఫ్సీ ప్రాంతీయ సలహామండలి హైదరాబాద్కి సభ్యుడిగా పనిచేశారు. ఇఫ్పీ మూవీ మార్కెట్ అడ్వయిజరీ ఎడిటర్గా పనిచేశారు. ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకుగానూ ఎన్నో పురస్కారాలు వరించాయి. 95లో ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా నంది అవార్డునందుకున్నారు. 97లో 'మేఘసందేశం'కిగానూ క్రిటిక్ అవార్డును, 2000లో ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు(దాసరి నారాయణరావు స్వర్ణ పతకం) అందుకున్నారు. 2004లో చిరంజీవి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డులు వరించాయి. 61వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సినిమా గ్రంధం 'సినిమా గా సినిమా'కు స్వర్ణకంకణం అవార్డు వరించింది. అలాగే 2013లో ఇదే పుస్తకానికి నంది అవార్డు వరించింది. నందగోపాల్ అంత్యక్రియలు నేడు(శనివారం) హైదరాబాద్లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నందగోపాల్ మృతికి పలువురుసినీ ప్రముఖులు, సినీ జర్నలిస్టులు సంతాపం తెలిపారు.