Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సురేష్ ప్రొడక్షన్లో అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే వినూత్న కథాంశంతో యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ 'ఈ నగరానికి ఏమైంది?' వంటి చిన్న బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాం' అని సురేష్బాబు అన్నారు. నూతన నటీనటులతో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని సురేష్బాబు నిర్మించారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సురేష్బాబు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, ''పెళ్ళి చూపులు' తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రమిది. తను ఒక సినిమాతోనే మిగిలిపోకూడదని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. లఘు చిత్రాలు రూపొందించే దర్శకుడి స్ట్రగుల్స్ని, సక్సెస్ను తెలియజేసే చిత్రమిది. తన జీవితం ఆధారంగా తరుణ్ భాస్కర్ ఈ కథ రాసుకున్నారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎలాంటి డ్రామా లేకుండా రోజువారి మనం మాట్లాడుకునే భాషే సినిమాలో ఉంటుంది. నలుగురు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది. కామెడీ, ఎమోషన్స్ సమ్మేళనంగా ఉంటుంది. దర్శకుడు తరుణ్ సినిమాను ఎంతగానో ప్రేమిస్తాడు. కొత్త కథల్ని సరికొత్త పంథాలో చెప్పడమంటే తనకిష్టం. 'పెళ్ళిచూపులు' తర్వాత చాలా మంది పెద్ద హీరోలు తనతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. నేను కూడా పెద్ద హీరోలతో చేస్తావా అని అడిగా. మరో చిన్న సినిమా చేసి తానేంటో నిరూపించుకున్నాకే పెద్ద సినిమా చేస్తానని అన్నాడు. అందుకే ఈ సినిమా నిర్మించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల షోస్ వేశాం. చూసిన వారంతా చాలా బాగా ఉందని మెచ్చుకున్నారు. సినిమాను సింక్సౌండ్తో తెరకెక్కించాం. దీంతో డబ్బింగ్ అవసరం లేదు. దీని వల్ల ఆర్టిస్టులు నటన, డైలాగ్ డెలివరీపై దృష్టిపెడతారు. భవిష్యత్లో యువ దర్శకులందరూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు. రాబోయే రెండేండ్లలో మా సురేష్ ప్రొడక్షన్లో నిర్మాణ పరంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం. త్వరలో బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా ఓ భారీ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నాం. దీనికి కథానాయికలు ఫైనల్ కాలేదు. జులైలో రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం. గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా 'హిరణ్య' అనే చిత్రాన్ని రూపొందించనున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా ఉంటుంది. మహేంద్ర దర్శకత్వంలో పూర్తి తెలంగాణ నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పీపుల్స్ మీడియా సంస్థతో కలిసి నాలుగు చిత్రాన్ని నిర్మించబోతున్నాం' అని అన్నారు.