Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు హీరోగా 'అసుర' ఫేమ్ కృష్ణ విజరు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. శ్రీ ఓం సినిమా సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజరు ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో శ్రీవిష్ణుపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ నివ్వగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, 'విజరు దర్శకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. కొన్ని ఏండ్లుగా మేం కలిసి పనిచేస్తున్నాం. ప్రొడక్షన్లో భాగమైన రిజ్వాన్కి థ్యాంక్స్. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. యాక్షన్ డ్రామా చిత్రమిది. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి జోనర్ సినిమా రాలేదు. నా పాత్ర సైతం నవ్యంగా ఉంటుంది' అని అన్నారు. ''అప్పట్లో ఒకడుండేవాడు', 'నీది నాది ఒకే కథ' చిత్రాల తర్వాత శ్రీవిష్ణుతో కలిసి ఈ సినిమాలో భాగమవుతూ దర్శకత్వం వహిస్తున్నాను. శ్రీవిష్ణు హీరోగా సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉంది. జులైలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. మూడు నెలలు కంటిన్యూగా షూటింగ్ జరిపి ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ఓ కొత్త తరహా శ్రీవిష్ణును చూస్తారు' అని దర్శకుడు కృష్ణ విజరు తెలిపారు. నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ, 'దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. కొత్తగా ఉంది. వెంటనే సినిమా చేద్దామన్నాను. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నాం' అని చెప్పారు. 'మంచి కథా బలమున్న సినిమాకు సంగీతం అందించడం హ్యాపీగా ఉంది' అని సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ ధర్మేంద్ర కాకర్ల, కో ప్రొడ్యూసర్లు ఖుర్షీద్, అచ్చుత్ రామారావు తదితరులు పాల్గొన్నారు.