Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం 'పంతం'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం విజయవాడలో జరిగింది. అతిథిగా విచ్చేసిన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'గోపీచంద్ కృష్ణాజిల్లా పడమటి లంక అల్లుడు. ఈ వేడుకకు రాగానే టి.కృష్ణ గుర్తుకొచ్చారు. గొప్ప దర్శకుడాయన. 85లో తెలుగు జాతి గర్వపడే సినిమాలు తీశారు. ఆయన తీసిన 'నేటి భారతం', 'రేపటి పౌరులు', 'వందేమాతరం', 'దేవాలయం', 'ప్రతిఘటన' వంటి అద్భుత చిత్రాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. తమ సినిమాలతో సమాజానికి స్ఫూర్తినింపారు. కసితో సినిమాలు తీసి జాతికందించారు. ఇప్పుడు గోపీచంద్ 'పంతం'లో సమాజాన్ని పీడించే సమస్యలను చూపిస్తున్నారు. గోపీచంద్ తండ్రి స్ఫూర్తిని తీసుకుని ఈతరం బ్యానర్ను బ్రతికించాలని కోరుతున్నా. గోపీచంద్ అరడుగుల అందగాడు. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'సినిమా ప్రారంభం కావడానికి ప్రసాద్ మూరెళ్ల, రైటర్ రమేష్రెడ్డి కారణం. ఈ కథ విని ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేశా. 'ఛాన్స్ ఇస్తే కచ్చితంగా మంచి సినిమా తీస్తా' అని దర్శకుడు చక్రి అన్నారు. చెప్పినట్టే అద్భుతంగా తీర్చిదిద్దారు. నేను నటించిన 25 చిత్రాల్లో 'యజ్ఞం'లో మంచి సందేశం ఉంటుంది. అలాంటి సందేశాత్మక చిత్రమిది. ఓ స్ట్రాంగ్ సందేశాన్ని చెప్పగలుగుతున్నానని తృప్తిగా ఉంది. నాన్నగారి సినిమాల రేంజ్లో ఉంటుందని చెప్పలేను గానీ ఆ టింజ్ ఇందులో ఉంటుంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాకు బ్యాక్ బోన్లా నిలబడ్డారు.
రాధామోహన్ మేకింగ్ విషయంలో రాజీపడలేదు. గోపీసుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. మెహరీన్ బాగా నటించింది. టీమ్ అందరికి థ్యాంక్స్' అని గోపీచంద్ చెప్పారు. దర్శకుడు కె.చక్రవర్తి మాట్లాడుతూ, 'గోపీసుందర్ వండర్ఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు. ప్రసాద్మూరెళ్ళ లేకపోతే సినిమా లేదు. అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు. నేను రాసుకున్న యాక్షన్ సీనుకు 70మార్కులు పడితే గోపీచంద్ చేసిన తర్వాత ఆ సీన్కు వందకు రెండొందల మార్కులొస్తాయి. ఆయన డైలాగ్స్ చెబితే అంత మ్యాన్లీగా ఉంటుంది. కమాండబుల్ యాక్టింగ్, వాయిస్ ఉన్న హీరో. ఆయన 25వ సినిమా చేసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్' అని చెప్పారు. 'గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దర్శకుడు కథను చెప్పినట్టే తీశారు. అనుకున్న ప్లానింగ్లో సినిమాను పూర్తి చేసి జులై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మనదేశాన్ని పీడించే సమస్య ఆధారంగా చేసుకుని సినిమా చేశాం. సందేశంతోపాటు కమర్షియల్ విలువలతో కూడిన చిత్రమిది' అని నిర్మాత కె.కె.రాధామోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎఫ్డీసీ చైర్మెన అంబికా కృష్ణ, గోపీసుందర్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, దర్శకులు గోపీచంద్ మలినేని, సంపత్నంది, బాబీ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.