Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి ప్రముఖ నేపథ్య గాయని కె.రాణి(75) ఇకలేరు. 'దేవదాసు'లో 'అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా..' అంటూ శ్రోతల హృదయాల్లో తన స్థానం సుస్థిరం చేసుకున్న ఆమె శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, సింహాళ, ఉజ్బెక్ వంటి భాషల్లో 500లకుపైగా పాటలను ఆలపించారు. సింహాళ, ఉజ్బెక్ భాషల్లో పాటలు పాడిన మొదటి తెలుగు సింగర్ రాణి. అంతేకాదు కాదు శ్రీలంక జాతీయ గీతం కూడా ఆలపించి రికార్డు సృష్టించారు. 1943లో జన్మించిన కె.రాణి తన ఎనిమిదేండ్ల వయసులో 1951లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. 'రూపవతి' చిత్రానికి పాటలు పాడారు. 'కళ్యాణి', 'పెళ్ళి చేసి చూడు', 'ధర్మ దేవదై' చిత్రాల్లో పాటలు పడి ఆకట్టుకున్నారు. 1953లో శ్రీలంక సినిమా 'సుజాత'లో ఆనంద సమరకూన్ సంగీత దర్శకత్వంలో పాడారు. తెలుగులో 'పరమానందయ్య శిష్యులు', 'ఛండిరాణి', 'దేవదాసు', 'కన్నతల్లి', 'చంద్రహారమ్', 'నిరుపేదలు', 'చెరపకురా చెడేవు', 'జయసింహా', 'సంతోషం', 'వదినగారి గాజులు', 'భలే రాముడు', 'చరణదాసి', 'చిరంజీవులు', 'అల్లాదిన్ అద్భుత దీపం', 'దొంగల్లో దొర', 'సతీ అనసూయ', 'సతీ సావిత్రి', 'తోడికోడళ్ళు', 'అన్నాతమ్ముడు', 'శోభ', 'బాలనాగమ్మ', 'దైవబలం', 'మనోరమ', 'పెళ్ళిసందడి', 'సభాష్ రాముడు', 'మహాకవి కాళిదాసు', 'పిల్లలు తెచ్చిన రాజ్యం', 'ఉషాపరిణయం', 'గాలి మేడలు', 'లవకుశ', 'వారసత్వం', 'విశాల హృదయం' వంటి చిత్రాల్లో అనేక పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఆమె ఎక్కువగా సి.ఆర్.సుబ్బురామన్, జి.రామనాథన్, కె.వి.మహాదేవన్, ఘంటసాల, ఓగిరాల రామచంద్రరావు, టి.జి.లింగప్ప, ఎస్.వి. వెంకటరత్నం, సాలూరి రాజేశ్వరరావు వంటి ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో గీతాలు ఆలపించారు. అంతేకాదు కొంత మంది గాయకులతో ఎక్కువగా పాటలు పాడారు. వారిలో ఘంటసాల, ఏ.ఎమ్. రాజా, పి.బి.శ్రీనివాస, టి.ఎం.సౌందరరాజన్, తిరుచి లోగనాథన్, జె.పి.చంద్రబాబు, పెండ్యాల నాగేశ్వరరావు, పి.సూరిబాబు, కె.జె.ఏసుదాసు, ఎల్.ఆర్.ఈశ్వరీ వంటి వారితో కలిసి పాటలు పాడి మెప్పించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. పాపులర్ పాటలు: 'పరమానందయ్య శిష్యులు'లో 'పోలికా రాధా', 'ఎదిరా లక్ష్మణా', 'పెళ్ళి చేసి చూడు' చిత్రంలో 'బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య..', 'దేవదాసు'లో 'అంతా భ్రాంతియేనా జీవితానా..', 'చెలియా లేదు చెలిమి లేదు..', 'జయసింహా'లో కొందమీద కోక్కిరయి..', 'లవకుశ'లో 'అశ్వమేధ యాగానికి..', 'జయ జయ రామా..', వంటి పాటలతో అలరించారు. దాదాపు ఎనిమిదికిపైగా భాషల్లో ఎన్నో పాటలతో విశేషంగా అలరించిన ఆమెను కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ 'ఇన్నిసారు రాణి' అని కీర్తించారు. సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్లో సంగీత ప్రదర్శన ఇచ్చారు. రాణి..గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకున్నాక సినీ సంగీతానికి దూరమయ్యారు. ఆమె మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు.