Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖయ్యూం, గౌరవ్, మధులగదాస్, అధియ నాయకానాయికలుగా శేఖర్చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'డేంజర్ లవ్స్టోరీ'. లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత లక్ష్మి సమర్పణలో అవధూత గోపాల్రావు నిర్మిస్తున్న ఈచిత్రం ఆడియో వేడుక ఆదివారం రాత్రి ఫిలింఛాంబర్లో వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత సి.కళ్యాణ్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి సీడీని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, కార్యదర్శి సాయివెంకట్లకు అందజేశారు. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ,'చిన్న సినిమాలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఎన్ని పనులతో బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడుకకు వచ్చాను. ప్రతీ నిర్మాత సినిమా తీసేంత వరకే పెద్ద సినిమా, చిన్న సినిమా అని అనుకుంటారు. హిట్ అయిన తర్వాత ఏదైనా ఒకటే. ఆ తారతమ్యం అస్సలుండదు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'గత 20 ఏండ్లుగా నటుడిగా చాలా సినిమాల్లో నటించాను. ఆ అనుభవంతో నిర్మాతగా మారి ఈ సినిమాని తీశాను. గోవా, కొల్లాపూర్, హైదరాబాద్లోని అందమైన లొకేషన్స్లో షూటింగ్ జరిపాం. కొల్లాపూర్ దగ్గరలోని కృష్ణానదిలో ఐదు పడవలపై ఎంతో రిస్క్తో తీసిన పాట ఈ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా అబ్బాయి గౌరవ్ ఇందులో ఒక హీరోగా నటించాడు. ఆగస్ట్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత అవధూత గోపాల్రావు తెలిపారు. 'గతంలో 'అనగనగా ఒక అరణ్యం', 'రింగా రింగా' వంటి చిత్రాలు చేశాను. ఇది మరో విభిన్న కథా చిత్రం. ప్రేమ, హర్రర్, సస్పెన్స్ అంశాలతో ఈచిత్రం ఉంటుంది. ఇందులో దెయ్యం ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇద్దరు హీరోలు, విలన్లకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలు భయానకంగా ఉంటాయి' అని చెప్పారు. 'ఇందులో ఐదు పాటలతోపాటు రీ-రికార్డింగ్ అందరినీ అలరిస్తుంది' అని సంగీత దర్శకుడు భానుప్రసాద్ అన్నారు.