Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మారుతున్న కాలం ప్రకారం సినిమాకు వందల కోట్ల బడ్జెట్ పెట్టడం తప్పనిసరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో సక్సెస్ రేట్ పెరగకపోతే కష్టం' అని అంటున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ పతాకంపై ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, జూ.ఎన్టీఆర్ ఇలా హేమాహేమీలతో సినిమాలు తీసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నారు. మహేష్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్చరణ్ వంటి స్టార్ హీరోలను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఈయనదే. కొంత గ్యాప్ తర్వాత ఇటీవల 'మహానటి' సక్సెస్తో రీఎంట్రీ ఇచ్చారు.
తాజాగా నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్' చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్వినీదత్ మంగళవారం మీడియాతో ముచ్చటించిన విశేషాలు ఆయన మాటల్లోనే..
స్నేహానికి గొప్ప నిర్వచనం..
చాలా గ్యాప్ తర్వాత మా బ్యానర్లో రూపొందించిన మల్టీస్టారర్ చిత్రమిది. స్నేహానికి గొప్ప నిర్వచనంగా నిలుస్తుంది. భిన్న ధృక్పథాలు కలిగిన వ్యక్తులు కలిసి సాగించే ప్రయాణమిది. 'గుండమ్మకథ' తరహాలో ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ముంబయికి చెందిన శ్రీధర్ రాఘవన్ అందించిన పాయింట్ను తీసుకుని భూపతిరాజా కథ సిద్ధం చేశారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. రెండున్నర గంటలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా ఇది. అవార్డులు, కళాఖండం అని చెప్పను కానీ కచ్చితంగా ప్రతి సన్నివేశం ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పగలం. 'అజాద్' సినిమా తర్వాత నాగార్జునతో చేస్తున్న సినిమా ఇది. ఒకప్పడితో పోల్చితే ఆయనలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోతున్నా. కథ, కథనాల నుంచి చిత్రీకరణ వరకు అన్ని విభాగాలపై దృష్టిసారిస్తున్నారు. నానికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. నాగార్జున, నాని మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.
డబ్బు కోసం సినిమాలెప్పుడూ తీయలేదు..
నా 20వ ఏట సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ టైమ్లోనే విశ్వనాథ్ దర్శకత్వంలో 'ఓ సీత కథ' సినిమా తీశా. సినిమా అంటే హీరోనే అని నమ్మి ఇండిస్టీకి వచ్చిన వాడిని. నమ్మడమే కాదు, అలాంటి సినిమాలే తీశా. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులతో మా వైజయంతి మూవీస్ ప్రారంభమైంది. పద్మాలయ స్టూడియో ఉన్నప్పటికీ మహేష్బాబును నా బ్యానర్లో లాంచ్ చేయించడం గౌరవంగా భావిస్తున్నా. అలాగే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్లను మా సంస్థతోనే లాంచ్ చేశా. వారిప్పుడు గొప్ప స్థానంలో ఉండటం ఆనందంగా ఉంది. కొత్తదనం, వారసత్వానికి ప్రాధాన్యతనిచ్చాం. అందుకే ఇన్నేండ్లు మనుగడ సాధించాం. డబ్బు కోసం ఎప్పుడూ సినిమాలు తీయలేదు. అలాంటి మా సంస్థలో 'మహానటి' వంటి అద్భుతమైన చిత్రాన్ని తీయడం, ఆ సక్సెస్తో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా, గౌరవంగా ఉంది. ఈ సినిమా గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు. మాకు ఘనకీర్తి తెచ్చిపెట్టింది. ఇది ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నా.
వందల కోట్ల బడ్జెట్ చాలా కామన్ అయిపోయింది..
నేను చేసింది చిన్న బడ్జెట్ చిత్రాలే అయినా అవి విడుదలై పెద్ద విజయాలను సాధించాయి. ఇప్పుడు మారిన కాలం ప్రకారం సినిమాలకు భారీ బడ్జెట్లు పెట్టాల్సి వస్తుంది. వందల కోట్లు కామన్ అయిపోతుంది. ఒకప్పుడు భారీ సినిమాల్ని నిర్మించే నిర్మాతలు రామానాయుడు, వి.బి.రాజేంద్రప్రసాద్, విజయ ప్రొడక్షన్స్ మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి నిర్మాత భారీ బడ్జెట్ సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారో వారికే అవగాహన ఉండటం లేదు. 1970లో పది శాతం సక్సెస్ రేట్ ఉండేది. ఇప్పుడదే పదిశాతం ఉంటే నిర్మాతకు మనుగడ కష్టం. ఓవర్సీస్, శాటిలైట్, మల్టీప్లెక్స్ సంస్కృతి కొంత నిర్మాతలకు ప్రయోజనకరంగా మారింది. రిస్క్ కూడా తగ్గింది. అయితే నిర్మాత కేవలం క్యాషియర్గానే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే కొన్నేండ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.
చిరంజీవితో సినిమా..
ప్రస్తుతం నాగ్ అశ్విన్ రెడీ చేస్తున్న కథ చిరంజీవికి బాగా సూట్ అవుతుందనిపించింది. విజరు దేవరకొండతో రెండు సినిమాలు చేయనున్నాం. అందులో ఒక సినిమాకు రాజ్ డి.కె. దర్శకత్వం వహిస్తాడు. ఆ తర్వాత ఎన్టీఆర్తో సినిమా ఉంటుంది. తమిళంలో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. హిందీలో కూడా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే వయాకామ్ 18 మీడియాతో కలిశాం. నాగ్ అశ్విన్ కూడా హిందీలో కొన్ని కథలు రాస్తున్నాడు. నా కూతుళ్ళు స్వప్న, ప్రియాంక చక్కటి విజయాలతో దూసుకుపోతున్నారు. వారి నాయకత్వంలో ఇతర భాషా చిత్రాలుంటాయి. ఇక నేను నిర్మాతగా 45 ఏండ్ల సినీ ప్రయాణంలో 52 సినిమాలు నిర్మించా. చాలా తృప్తిగా, ఆనందంగా నా జర్నీ సాగింది. త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నా. మా తండ్రి కమ్యూనిస్ట్. కానీ చంద్రబాబుపై ఉన్న ఇష్టంతో నేను టీడీపీలోకి వెళ్ళా. వచ్చే ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తాను.