Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కన్ ఫ్యూజన్ కామెడీతో సాగే చిత్రమిది. సినిమా బాగా రావడానికి నా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాను' అని అంటోంది యామిని భాస్కర్. ఇటీవల 'నర్తనశాల'లో కథానాయికగా మెరిసిన యామిని తాజాగా పార్వతీశం, నవీద్లతో కలిసి 'భలే మంచి చౌక భేరమ్' చిత్రంలో నటించారు. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. నేడు(గురువారం) యామిని భాస్కర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ, 'ఇందులో నేను ఆదర్శి అనే పాత్రలో నటించాను. ఎదుటి వారి కష్టాల్లో ఉంటే తన దగ్గరున్నది కూడా ఇచ్చేసే మంచి మనసున్న అమ్మాయి పాత్ర నాది. హీరో కూడా నా మంచి మనసుని క్యాష్ చేసుకుని మోసం చేస్తాడు. రియల్ లైఫ్లో కూడా నేను అంతే. ఎదుటివారి కష్టాల్లో ఉంటే నా వల్ల సాధ్యమైన సాయం చేస్తాను. సినిమా విషయానికి వస్తే.. కన్ఫ్యూజన్ కామెడీ చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. నిజానికి ఇది 'నర్తనశాల' చిత్రానికి ముందే విడుదల కావాల్సింది. ఆ సినిమా త్వరగా రిలీజ్ అయ్యింది. నాకు కామెడీ చేయడం ఇష్టం. అలాంటి పాత్రలు రావడం లేదు. వస్తే తప్పకుండా చేస్తాను. ఇందులో నాపాత్రలో నాన్ సింక్ కామెడీ ఉంటుంది. కన్ ఫ్యూజన్ వల్ల ఎక్కువ హాస్యం పుడుతుంది. సినిమా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. షూటింగ్లో ఐదు నుంచి పది మందే ఆర్టిస్టులుండేవారు. దీంతో దర్శకుడు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తెరకెక్కించారు. నవీద్, పార్వతీశంలతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఇండిస్టీలోకి వచ్చి మూడేండ్లు అవుతుంది. చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా ఎలాంటి సినిమాలు ఆడతాయి, ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలనేది తెలిసింది. నేను సక్సెస్ అవుతానో లేదో నా చేతుల్లో లేదు. వీలైనంత వరకు మంచి సినిమాలు చేస్తూ ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా. పాత్ర నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటున్నా. ఏ సినిమాలో అయినా నా పాత్రకు ప్రాధాన్యత లేకపోతే గుర్తింపు రాదు. అందుకే బలమైన పాత్రలు చేసేందుకు ప్రయారిటీ ఇస్తున్నాను. తమిళంలో ఓ సినిమా చేశా. ఆ తర్వాత అక్కడ చాలా ఆఫర్స్ వచ్చాయి. మంచి బ్యానర్లో చేయాలని వెయిట్ చేస్తున్నా' అని తెలిపింది.