Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో వి.క్రియేషన్స్, ఏషియన్ సినిమాస్ పతాకాలపై కలైపులి ఎస్.థాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు(శుక్రవారం) హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి 'హిప్పీ'
అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు టి.ఎన్.కృష్ణ మాట్లాడుతూ, ''సిల్లును ఒరు కాదల్'(నువ్వు నేను ప్రేమ), 'నెడుంజాలై' తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాం. తన తొలి చిత్రానికి భిన్నంగా ఇందులో కార్తికేయ కనిపించనున్నారు. జాలీగా, క్యాజువల్గా సాగే పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లుంటారు. వారిని ఇంకా ఫైనల్ చేయలేదు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే సినిమా ఇది. మన జీవితంలో
నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబర్ నుంచి హైదరాబాద్లో షూటింగ్ జరుపనున్నాం' అని అన్నారు.
'తమిళంలో 1985 నుంచి వరుసగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నాం. అటు పంపిణీ రంగంలోనూ మాదైన ముద్రతో కొనసాగుతున్నాం. తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ నటించిన 'ఆర్.ఎక్స్ 100' చూశా. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గ హీరో అనిపించారు. ఆయనతో 'హిప్పీ' సినిమా తెరకెక్కిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బడ్జెట్ విషయంలో రాజీపడకుండా సినిమాను గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నాం' అని నిర్మాత కలైపులి ఎస్.థాను చెప్పారు.
హీరో కార్తికేయ చెబుతూ, ''ఆర్.ఎక్స్100' తర్వాత ఓ పెద్ద అవకాశం రావడం నా అదృష్టం. కథ చాలా బాగుంది. నిత్యం మన జీవితంలో జరిగే అంశాలను తెరపై చూడొచ్చు. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది' అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: నివాస్ కె.ప్రసన్న. ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.