Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనిష్, ప్రియా సింగ్ జంటగా కార్తికేయ.వి దర్శకత్వంలో నల్ల స్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'రంగు'. ఈ చిత్ర ట్రైలర్ను శనివారం పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'విజయవాడలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం. రౌడీలను సమాజం తయారు చేస్తుంది. అందులో పోలీస్ పాత్ర చాలా వరకు ఉంటుంది. అలా ఓ పోలీస్ నేరస్థుడిని సంస్కరణ చేయడమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. తనిష్ చాలా బాగా నటించాడు. మా అబ్బాయి రవీందర్ నెగటివ్ రోల్ పోషించాడు. సిరివెన్నెల సీతారామాశాస్త్రి కాంబినేషన్లో మేం పనిచేసిన చాలా సినిమాలు విజయాల్ని సాధించాయి. చాలా రోజుల తర్వాత మేం ఈ సినిమాకు కలిసి పనిచేశాం. ఫొటోగ్రఫీ బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా నేచురల్గా చూపించారు. ఇది ఏడు సంవత్సరాల జర్నీ కాబట్టి సినిమాల్లో చెప్పడం కష్టం. పాటలు కూడా కథని చెబుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది' అని అన్నారు.
'లారా అనే పాత్ర ప్రధానంగా సినిమా సాగుతుంది. ఇందులో నాలుగు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా యువతకు ఓ గుణపాఠం లాంటిది. సోషల్ మెసేజ్ ఉంటుంది. నేర్చుకునేలా, ఆలోచించేలా ఉంటుంది. మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం' అని తనిష్ చెప్పారు. నిర్మాత అయ్యన్న నాయుడు చెబుతూ, 'మా బ్యానర్లో రెండో సినిమాగా దీన్ని ప్రారంభించాం. కానీ ఫస్ట్ ఇదే విడుదలకు సిద్ధమవుతుంది. మొదటి సినిమాకే పెద్ద టెక్నీషియన్లు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం' అని చెప్పారు. 'విజయవాడకు చెందిన రౌడీ షీటర్ జర్నీని తెలిపే చిత్రమిది. దీనికోసం చాలా స్టడీ చేశా' అని దర్శకుడు కార్తికేయ తెలిపారు. మరో నిర్మాత పద్మనాభరెడ్డి చెబుతూ, 'ఆకలిని మరచిపోయి ఆశయం కోసం కృష్ణానగర్లో తిరిగే ఎంతో మంది దర్శకుల ఆశయాన్ని బతికించడం కోసం ఈ బ్యానర్ను స్థాపించాం. మా బ్యానర్లో ప్రస్తుతం ఏడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి' అని చెప్పారు.