Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రథం' సినిమాలో డీప్ రొమాన్స్ ఉంటుంది. అయితే అది కావాలని పెట్టింది కాదు, కథలో భాగంగానే ఉంటుంది. కథకి అవసరం' అని అంటున్నారు హీరో గీతానంద్. చంద్రశేఖర్ కానురి దర్శకత్వంలో రూపొందిన 'రథం' చిత్రంలో గీతానంద్, చాందిని భగ్వానని జంటగా నటించారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం గీతానంద్ మీడియాతో మాట్లాడుతూ, 'నేను పుట్టింది గుంటూరే అయినా హైదరాబాద్లో నాన్నమ్మ దగ్గర పెరిగా. నాన్న సినిమాల్లో పనిచేశారు. చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కథలు చెప్పడం చాలా ఇష్టం. ఫ్రెండ్స్కు తరచూ నాకు తోచిన విషయాలను కథలుగా చెప్పేవాడిని. ఆ ప్రయత్నాల్లో భాగంగా పలు లఘు చిత్రాలు చేశా. మా నాన్నకి చూపిస్తే ఆయన హగ్ చేసుకుని 'నీలో ఇంత టాలెంట్ ఉందారా' అని ప్రోత్సహించారు. అలా రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 'నక్షత్ర' అనే వెబ్ సిరీస్ కూడా తీశాను. దర్శకత్వం వహించాలంటే ఛాన్స్లు రాలేదు. సినిమా అంటే ప్యాషన్ ఉంది, నటుడిగా ఎందుకు ప్రయత్నించకూడదని కొన్ని రోజుల పాటు నటనలో శిక్షణ తీసుకున్నా. మొదట చంద్రశేఖర్ కానురితో కలిసి కథ డిస్కస్ చేసుకున్నాం. 'పంతం' అనే సినిమా ప్రారంభించాం. పది రోజులు షూటింగ్ చేశాక ఆగిపోయింది. ఆ తర్వాత 'తెలిసి తెలియక' సినిమా చేస్తే, అదీ ఆగిపోయింది. దీంతో జీవితం అల్లకల్లోలంగా మారిందనే ఫీలింగ్ కలిగింది. అయినా ధైర్యంతో ఉన్నాను. మళ్ళీ చంద్రశేఖర్ కలిసి ఈ కథ చెప్పారు. ఆయన చంద్రశేఖర్ ఏలేటి వద్ద పనిచేశారు. ఈ కథ బాగా నచ్చింది. ఏం చేయాలో తెలియని చీకటిలో ఉన్న మాకు నిర్మాత రాజా ఓ వెలుగులా వచ్చారు. సినిమా పట్టాలెక్కింది. అన్ని రకాల ఎమోషన్స్ మేళవించిన లవ్ స్టోరీ ఇది. నేను రైతుగా నటించాను. వ్యాల్యూస్, ఎథిక్స్ను నమ్ముకుంటూ ముందుకు సాగుతుంటాను. నచ్చింది చేస్తాను. నాకు పరిచయమైన అమ్మాయి మనస్థత్వం కూడా అలాంటిదే. ఈ క్రమంలో మా మధ్య ప్రేమ ఎలా పుట్టింది. ఆ ప్రేమ ఏ తీరం చేరింది? రైతుగా నేను అందుకోవాల్సిన లక్ష్యాలు అందుకున్నానా, లేదా? అన్నది సినిమా. రొటీన్కి భిన్నమైన సినిమా ఇది. కచ్చితంగా ఆకట్టుకుంటుందని, మా అందరి జీవితాలకిది టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నాం. నేను హీరోగా కంటే నటుడిగా రాణించాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్లు చర్చల దశలో ఉన్నాయి' అని అన్నారు.