Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనకు అండగా ఉండేది సాటి మనిషే అని నేను నమ్ముతా. అలాంటి సాయం చేసే మనిషి కాదంబరి కిరణ్' అని దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. 'మనంసైతం' పేరుతో కాదంబరి కిరణ్ పేద కళాకారులకు ఆర్థికసాయం అందిస్తున్న విషయం విదితమే. శనివారం మణికంఠ, పి.రంగాచార్యులు,
లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్, అంజనాదేవి, టీఎన్వీ గాయత్రి, ఝాన్సీ, భాస్కర్, దిలీప్ తేజలకు ఆర్థిక సాయం అందించారు. అతిథిగా విచ్చేసిన పూరీ జగన్నాథ్, బిగ్బాస్ విజేత కౌశల్, నటి జయలలిత, అశోక్ కుమార్ వారికి చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా నటి జయలలిత లక్ష రూపాయలు, జూ.ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు స్వామిగౌడ్, అనిల్, రవి లక్షరూపాయలు, నిర్మాత బన్నీవాసు రూ.75వేలు, కౌశల్ 25వేలు విరాళంగా ప్రకటించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ 'మనంసైతం'కు ప్రత్యేకమైన యాప్ను తయారు చేసి ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నేను ఇండిస్టీకి వచ్చిన కొత్తలో కాదంబరి నాకు ఏదో ఒక పని ఇప్పిస్తూ వెయ్యి, రెండు వేలు చేతిలో పెట్టేవాడు. సేవా దృక్పథం అనేది ఆయన రక్తంలోనే ఉంది. ఆయన మీద పరిశ్రమలో ఉన్న మంచి పేరు వల్లే మనం సైతం ఇంత బాగా ముందుకెళుతోంది. మనందరం కలిసి ఈ సేవా సంస్థను మరింత అభివృద్ధి చేయాలి' అని అన్నారు. 'సినీ పెద్దలు ఈ కార్యక్రమానికి వస్తే ఇది మరింత మందికి చేరువవుతుంది. పేదవాళ్ళ కోసం బతికున్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా. వారి కోసం పరిగెత్తుతూనే ఉంటా' అని కాదంబరి కిరణ్ తెలిపారు.