Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనపట్ల హీరో అర్జున్ అసభ్యంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరణ్ ఆరోపించిన విషయం విదితమే. దీనిపై తాజాగా అర్జున్ స్పందించారు. 'శ్రుతి ఆరోపణలు విని షాక్ అయ్యా. జీర్ణించుకోలేకపోయా. దీనిపై మాట్లాడకుండా ఉంటే నిజంగానే నేను తప్పు చేశానని అనుకుంటారు. అందుకే స్పష్టత ఇస్తున్నా. నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకులు సన్నివేశాన్ని ఇంకా బాగా తెరకెక్కించడానికి సలహాలు అడుగుతుంటారు. నేను మంచి సలహాలు ఇస్తే పాటిస్తారు. ఆ(కురుక్షేత్రం) చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవి సౌకర్యంగా లేవని నేను ఒప్పుకోలేదు. అలాంటి సన్నివేశాలు కచ్చితంగా ఉండాలంటే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానని ముందే చెప్పా. నిజంగానే నాపై శ్రుతికి కోపం ఉంటే ప్రమోషన్లో నన్ను ఎందుకు ప్రశంసించారు?, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది?, ఆమె ఆరోపణల వెనుక ఎవరైనా ఉన్నారా?' అని అర్జున్ ప్రశ్నించారు. 'నేనిప్పటి వరకు అరవై మంది అగ్ర కథానాయికలతో పనిచేశాను. ఎవరూ అభ్యంతరకరమైన ఆరోపణలు చేయలేదు. దీన్ని బట్టి నేనేంటో అర్థం చేసుకోవచ్చు' అని ఆయన అన్నారు. అర్జున్పై వస్తోన్న ఆరోపణలపై ఆయన కూతురు ఐశ్వర్య కూడా స్పందించారు. 'ఇన్నేండ్ల జీవితంలో మా నాన్న పబ్కి వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది ఆమెను రిసార్ట్కు ఎలా రమ్మంటారు?. అయినా ఆ సినిమా టైమ్లో ఎందుకు స్పందించలేదు?. ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా వారి పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తే దాన్ని 'మీ టూ' అంటారు. కానీ శ్రుతి చేస్తున్న ఆరోపణల్లో నాకు ఆ విషయం ఎక్కడా కనిపించడం లేదు' అని ఐశ్వర్య మండిపడ్డారు. ఇప్పుడీ వివాదం కన్నడ చిత్ర పరిశ్రమలలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. శ్రుతి హరిహరణ్పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె క్షమాపణలు తెలపాలని అర్జున్ కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆమెకు అర్జున్ క్షమాపణలు చెప్పాలని ప్రకాష్ రాజ్ కోరారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
మరోవైపు మలయాళంలోనూ 'మీటూ' వేడి కొనసాగుతుంది. తాను నటుడు దిలీప్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన అభిమానుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నానని నటి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 'బాలీవుడ్లో లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిన నటీమణులకు అవకాశాలు వస్తున్నాయి. మాలీవుడ్లో నటులను దేవుళ్ళుగా భావిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడిన నటీమణులను చిత్ర పరిశ్రమ వదిలేస్తుంది. నేను ప్రస్తుతం భయంతో జీవిస్తున్నా' అని పార్వతి పేర్కొన్నారు.
రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకుని సంగీత దర్శకుడు రెహ్మాన్ షాక్ అయ్యారు. అంతేకాదు దీనిపై విచారణ చేపడుతున్నట్టు ఆయన సోదరి ఏ.ఆర్.రిహానా తెలిపారు. 'ఎలాంటి ఇబ్బంది లేని పని ప్రదేశం కల్పించడమే తమ లక్ష్యమ'ని అంటోంది తాప్సీ. లైంగిక వేధింపుల విచారణ, వాటిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో తాప్సీ సభ్యురాలిగా చేరారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అనుమాలిక్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. నటీమణులు సోనా మొహపాత్రా, శ్వేతా పండిత్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాను న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న 'ఇండియన్ ఐడల్' నుంచి అనూ మాలిక్ తప్పుకున్నారు. తాజాగా ఆయనపై మరో గాయని అలీషా చినారు కూడా ఆరోపణలు చేశారు. లైంగిక ఆరోపణలతో దర్శకుడు సుభాష్ కపూర్ తప్పుకోవడంతో గుల్షన్ కుమార్ బయోపిక్ 'మొఘల్' ప్రాజెక్ట్లోకి నిర్మాతగా మళ్ళీ అమీర్ఖాన్ జాయిన్ అయ్యారు.