Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అరవింద సమేత' విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ
ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం 'అరవింద సమేత'. ఇటీవల విడుదలైన చిత్రానికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆదివారం చిత్రయూనిట్ విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ మాట్లాడుతూ, 'హరికృష్ణ అన్నయ్య మనసు వెన్న, మొరటు మనిషి. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి. ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం. ఇందులో డైలాగ్స్ వింటుంటే 'లెజెండ్' సినిమాలోని సంభాషణలు గుర్తొచ్చాయి. స్త్రీ గొప్పతనాన్ని, శక్తిని చాటిన చిత్రమది. సినిమా అంటే వినోదమే కాదు, ఆలోచింపచేసేదిగా ఉండాలి. ఈ సినిమా అలాంటిదే. త్రివిక్రమ్ మంచి నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఆయన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు. నేనూ, తారక్ చేసే సినిమాలు మిగిలిన వాళ్ళు చేయడం కష్టం. ఎందుకంటే మేం లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు చేస్తుంటాం. మా సినిమాల్లో నవరసాలు ఉండాలని అభిమానులు కోరుకుంటారు. మా పాత్రలు కూడా అలానే ఉంటాయి. ఈ సినిమాకు అంతా కష్టపడ్డారు. ఇప్పుడు మంచి ఫలితం వచ్చింది' అని అన్నారు. 'నల్లమబ్బు కమ్మిన విషాద ఛాయల్లో ఉన్న మా కుటుంబానికి త్రివిక్రమ్ ఈ సినిమా ద్వారా ఈ విజయదశమికి కొత్త వెలుగు తీసుకొచ్చారు. జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం అందించారు. నాన్న(హరికృష్ణ) లేకపోయినా మా తండ్రి హోదాలో బాబారు (బాలకృష్ణ) ఇక్కడికి వచ్చారు' అని అన్నారు.
కళ్యాణ్ రామ్ చెబుతూ, 'రాయలసీమ యాసలో తమ్ముడు డైలాగ్లు చెబుతుంటే అక్కడే పుట్టి పెరిగాడేమో అనిపించింది. వినోదాత్మక చిత్రాలు తీసే త్రివిక్రమ్ తొలిసారి ఎమోషనల్ చిత్రం తెరకెక్కించారు. జగపతిబాబు పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. ఆ పాత్ర బాగుండటం వల్లే తారక్ పాత్ర ఎలివేట్ అయ్యింది. సినిమాను ఆదరిస్తున్న ఆడియెన్స్ను ధన్యవాదాలు' అని చెప్పారు. 'ఈ విజయం ముందే ఊహించినదే' అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. త్రివిక్రమ్ చెబుతూ, 'ఈ దసరాకి గొప్ప కానుక ఇచ్చారు. మాటలు రానంత ఆనందాన్ని పంచారు. అందరికి థ్యాంక్స్' అని అన్నారు. 'నేను నటించిన బసిరెడ్డి పాత్ర గురించి మారుమూల ప్రాంతంలో కూడా మాట్లాడుతున్నారంటే కారణం త్రివిక్రమ్. ఇంతకంటే క్రూరంగా నన్ను మరెవ్వరూ చూపించలేరు' అని జగపతిబాబు చెప్పారు.