Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ జోనర్ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయో ఆ జోనర్లోనే ఎక్కువ సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతారు.
అది హిట్ ఫార్ములాతోపాటు కమర్షియల్ ఫార్ములా కూడా. ఇటీవల బాలీవుడ్లో క్రీడాకారుల బయోపిక్లకు మంచి డిమాండ్ ఉంది. 'భాగ్ మిల్కా భాగ్', 'మేరీ కోమ్', 'ఎం.ఎస్.ధోని', 'పాన్ సింగ్ తోమర్' చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీసు దగ్గర భారీ కలెక్షన్లతోపాటు అవార్డులను కూడా కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం పలు క్రీడాకారుల బయోపిక్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా ఫుట్బాల్ కెప్టెన్ బైచుంగ్ భూటియా బయోపిక్కి రంగం సిద్ధమైంది. 'జిల్లా ఘాజియబాద్' ఫేమ్ ఆనంద్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, 'గొప్ప వ్యక్తుల జీవితాలను వెండితెరపై చూపించాలనేది ఓ గౌరవంగా భావిస్తాను. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది.
పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అని ఆనంద్ తెలిపారు. దీనిపై భూటియా స్పందిస్తూ, 'వెండితెరపైకి ఎక్కించేంత స్టఫ్ నా జీవితంలో ఉందని నమ్మినందుకు చాలా గర్వంగా ఉంది. నా కథకు ఆనంద్ న్యాయం చేస్తారని భావిస్తున్నా. నేను సిక్కీంలోని చిన్నగ్రామంలో జన్మించా. ఇండియా తరఫున ఫుట్బాల్ టీమ్కి కెప్టెన్గా న్యాయం చేశాను. ఈ చిత్రానికి క్రియేటివ్ సైడ్ కూడా
నా హెల్ప్ ఉంటుంది' అని అన్నారు. సిక్కీంకు చెందిన భూటియా ప్రపంచ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుడిగా రాణించారు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్లో మూడుసార్లు ఇండియా టీమ్ను గెలిపించారు. అలాగే ఏఎఫ్సి ఛాలెంజ్ కప్ గెలవడంలోనూ ఆయనదే కీలక భూమిక. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు.