Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ... పాఠకులకు పరిచయం అక్కర్లేని కథానాయకుడు. పరిశ్రమలో ఎటువంటి సపోర్ట్ లేకుండా చిన్న చిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి హీరోగా అయిన వైనం, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, ఇమేజ్ను సొంతం చేసుకున్న తీరు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తన విలక్షణ కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించడంతోపాటు తనకంటూ ఓ ప్రత్యేక అభిమానగణాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. 'ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం', 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు', 'ఇడియట్', 'ఖడ్గం', 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', 'వెంకీ', 'నా ఆటోగ్రాఫ్', 'భద్ర', 'విక్రమార్కుడు', 'దుబారు శ్రీను', 'కృష్ణ', 'కిక్', 'డాన్శ్రీను', 'మిరపకారు', 'పవర్', 'బెంగాల్ టైగర్', 'రాజా ది గ్రేట్' వంటి తదితర చిత్రాలు మంచి విజయాలు సాధించడంతోపాటు ఒడిదుడుకుల్లో ఉన్న రవితేజ్ కెరీర్కి టర్నింగ్గానూ నిలిచాయి.
'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు' వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత రవితేజ లేటెస్ట్గా 'అమర్ అక్బర్ అంటోని' చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడం, 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన మైత్రి మూవీస్ బ్యానర్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అటు ప్రేక్షకుల్లోను, ఇటు రవితేజ అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతోపాటు రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన 'నీకోసం', 'వెంకీ', 'దుబారు శ్రీను' వంటి మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించడం కూడా ఈ అంచనాలు పెరగడానికి మరో కారణం. మరి ఈ అంచనాలను 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంతో రవితేజ రీచ్ అయ్యాడా లేదా అనేది చూద్దాం.
అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా) కుటుంబాలు అసలుసిసలైన స్నేహానికి అద్దం పట్టేలా ఉంటాయి. అమర్, ఐశ్వర్య ఫాదర్స్ ఇద్దరూ ఒకే కంపెనీని రన్ చేస్తుంటారు. వ్యాపార పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు ముఖ్యంగా ప్రజల్లో ఓ నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ తమ పిల్లలకు పెళ్ళి చేసి బంధువులుగా మారదామనే నిర్ణయానికొస్తారు. అలాగే తమ కంపెనీ మనుగడకు దోహదపడిన నలుగురు ఉద్యోగులకు కంపెనీలో షేర్ ఇస్తున్నట్టు ప్రకటిస్తారు. అయితే ఆ నలుగురు ఉద్యోగులు షేర్తో సంతృప్తి పడకుండా కంపెనీ మొత్తానికే అధిపతులు అవ్వాలనుకుంటారు. దీని కోసం అమర్, ఐశ్వర్యల కుటుంబాలను చంపేయాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్లో భాగంగా అమర్ బర్త్డే రోజు బాంబ్బ్లాస్ట్తో అందరినీ చంపేస్తారు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ నుంచి అమర్, ఐశ్వర్యలతోపాటు ఈ రెండు కుటుంబాలకు స్నేహితుడైన షిండే కూడా తప్పించుకుంటారు. చిన్నతనంలో జరిగిన ఈ దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అమర్, ఐశ్వర్య ఒకరికొకరు దూరమైపోతారు. అంతేకాదు ఈ ఘటనల వల్ల ఇద్దరూ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్స్తో (మల్టిఫుల్ పర్సనాలిటీ)బాధ పడుతుంటారు. తమ కుటుంబాలతోపాటు తమకి ఇష్టమైన వ్యక్తుల్ని చంపేసిన ఆ నలుగురు ఉద్యోగులను పెద్దయ్యాక అమర్, ఐశ్వర్య ఎలా తుదముట్టించారు?, ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఎలా కలిశారనేది మిగిలిన కథ.
కథగా తీసుకుంటే ఇదేమీ కొత్తది కాదు. అలాగే ఇందులో నాయకానాయికల పాత్రలకు ఉన్న మల్టిఫుల్ పర్సనాలిటీ ప్రాబ్లెమ్ కూడా కొత్తగా అనిపించదు. ఇప్పటికే 'అపరిచితుడు', 'చంద్రముఖి' వంటి చిత్రాలతో మల్టిఫుల్ పర్సనాలిటీ బిహేవియర్ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఈ సినిమాలో ఈ ప్రాబ్లెమ్తో ఉన్న వీళ్ళు తమ పగని ఎలా తీర్చుకుంటారని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు మాత్రం నిరాశే మిగులుతుంది. ఎందుకంటే ఈ సినిమా ప్రారంభంలోనే కథేంటో ప్రతి ప్రేక్షకుడికి తెలుస్తుంది. పైగా తదుపరి సన్నివేశాలు కూడా ఊహించినట్టుగానే వస్తూ బోర్ కొట్టిస్తాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ సన్నివేశమూలోనూ కొత్తదనం కనిపించకపోవడం గమనార్హం. మల్టిఫుల్ డిజార్డర్ కారణంగా రవితేజ ఇందులో అమర్, అక్బర్, ఆంటోనిగా బిహేవ్ చేస్తుంటాడు. ఈ పాత్రలు కూడా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం కూడా ఈ చిత్రానికి బిగ్గెస్ట్ మైనస్.
కథ పరంగా సీరియస్నెస్ ఉన్నప్పటికీ దీనికి అతీతంగా రవితేజ సినిమా అంటే డెఫినెట్గా ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే అది ఈ సినిమాలో మిస్ అయ్యింది. దీంతో ఆయన ఎంతో కొంత నవ్విస్తారని ఆశించిన ప్రేక్షకులు అసంతృప్తిగా ఫీలవుతారు. ఇక సినిమాలో వెన్నెలకిషోర్, సునీల్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్రెడ్డి, రఘుబాబు, గిరిధర్ వంటి హేమాహేమీ హస్యనటులున్నప్పటికీ వాళ్ళ కామెడీ సైతం ప్రేక్షకుల్ని పడి పడి నవ్వుకునేలా చేయడంలో విఫలమైంది. ఇదిలా ఉంటే, సినిమా చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు, పాత్రల బిహేవియర్ కన్ఫ్యూజ్ చేస్తాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు నాయకానాయికల మల్టిపుల్ పర్సనాలిటీ బిహేవియర్ మినహా మిగిలిదంతా కళ్యాణ్రామ్ నటించిన 'అతనొక్కడే' సినిమాని తలపించడం మరో బిగ్గెస్ట్ మైనస్.
ఫైనల్ పంచ్ : రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన 'నీకోసం', 'వెంకీ', 'దుబారు శ్రీను' వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేసి, మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. వాటితో పోలిస్తే ఈ సినిమానే కాదు ఈ క్రేజీ కాంబినేషన్ కూడా ప్రేక్షకుల్ని పూర్తిగా నిరాశకు గురి చేసింది. అలాగే 'కిక్', 'దేవుడు చేసిన మనుషులు', 'ఖతర్నాక్' వంటి తదితర చిత్రాల్లోని రవితేజ, ఇలియానా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఆ చిత్రాలతో కంపేర్ చేస్తే ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు' సినిమాలతో రవితేజ, 'ఆగడు', 'బ్రూస్లీ', 'మిస్టర్' వంటి చిత్రాలతో దర్శకుడు శ్రీనువైట్ల భారీ ఫెయిల్యూర్స్లో ఉన్నారు. వీరిద్దరికి సాలిడ్ హిట్ కావాల్సిన తరుణంలో విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేక డిజాస్టర్గా నిలిచింది. కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం, పాత్రలను ప్రజెంట్ చేసే తీరులో అనేక చోట్ల ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడం వంటివి ఈ చిత్రానికి అతి పెద్ద లోపాలు. ఏదిఏమైనా రవితేజ ఈ చిత్రంతో హ్యాట్రిక్ డిజాస్టర్ కొట్టాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రవితేజ ఇకనైనా మూసధోరణి కథలను కాకుండా ట్రెండ్కి అనుగుణంగా కొత్తదనంతో ఉండే కథలను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.