Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొవెరా, హిమాన్షి కాట్రగడ్డ జంటగా నటిస్తున్న చిత్రం 'యు'. 'కథే హీరో' అనేది ట్యాగ్లైన్. కొవెరా క్రియేషన్స్ పతాకంపై కొవెర దర్శకత్వంలో విజయలక్ష్మి కొండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర పాటల విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన శ్రీవిష్ణు మాట్లాడుతూ, 'కొవెర అసలు పేరు రాజేంద్ర. తను, నేను కలిసి ఇంటర్ చదువుకున్నాం. ఈ సినిమాలో ఓ సెన్సిబుల్ పాయింట్ ఉంది. పోలీస్ పాత్ర చేయాలంటే చాలా గట్స్ కావాలి. రాజేంద్ర తొలి సినిమాతోనే ఆ ప్రయత్నం చేయడం గొప్ప విషయం. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్కి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలి' అని అన్నారు. కొవెర చెబుతూ, 'బన్ని, అఖిల్, శ్రీవిష్ణు ఇలా చాలా మందికి కథలు చెప్పాను. ఓ దర్శకుడు హీరోని ఎలా ఒప్పిస్తాడనే ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సినిమా. కథ బాగుంటే డైరెక్షన్ అవకాశం ఇచ్చేయరు. వారితో ట్రావెల్ చేయాలి. ఎక్కువ రిస్క్ తీసుకునే దర్శకుడికి ఎప్పుడూ మంచి అవకాశాలుంటాయని నమ్ముతాను. అందుకే ఎవరూ తీసుకోని రిస్క్ తీసుకుని, నేనే హీరోగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నా. ఇంత కష్టపడ్డాను కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ జర్నీలో ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందులో ఒకరు నాని. ఆయనొక ఇంటర్వ్యూలో చెప్పిన మాట విని సినిమాలనే నమ్ముకోవాలని నా సాఫ్ట్వేర్ జాబ్ మానేశా. రెండో వ్యక్తి అల్లు అర్జున్. ఆయన్ని కలిసినప్పుడు నన్ను సోఫాలో కూర్చొబెట్టి, ఆయన మామూలు కుర్చిలో కూర్చున్నారు. కొత్త కథ తెచ్చావు, నేను కూడా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి కదా అన్నారు. అప్పుడు నాకు సిగ్గేసింది. అప్పుడే ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ప్రారంభమైంది. మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. నిర్మాతగా, హీరోగా, దర్శకుడిగా ఇన్ని టాస్క్లు చేయలేవన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ స్పీచ్ విని ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్నే నమ్ముకున్నా. ఈ సినిమాలో నేను టచ్ చేసిన పాయింట్ ఎవరూ చేయలేదు. ఇందులో ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్ డబ్బు ఎక్కడికి పోతుంది. బ్యాంక్లకు కోట్లు ఎగొట్టి విదేశాల్లో తిరుగుతున్న విజరు మాల్యా, నీరవ్ మోడీలకు డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది?, ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న వేల కోట్లు ఎక్కడివి అనే అంశాలకు సమాధానం ఈ నెల 14న దొరకనుంది. సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా' అని చెప్పారు.