Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సోషల్ మీడియాతోనే నాకింత పేరు, గుర్తింపు వచ్చింది. అది లేకపోతే నేను ఎవరికీ తెలిసేదాన్ని కాదు. అలాగే దీని ద్వారా చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నా' అని అంటోంది ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ చిత్రం 'ఒరు ఆడార్ లవ్'లోని ఓ పాటలో కన్నుగీటే సన్నివేశంతో విశేషంగా ఆకట్టుకుని, సోషల్ మీడియా ద్వారా ప్రియా బాగా పాపులర్ అయిన విషయం విదితమే. ఈ చిత్రాన్ని తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రియా ప్రకాష్ వారియర్ మీడియాతో మాట్లాడుతూ, 'ప్రస్తుతం నేను బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా.
మా నాన్న కోరిక మేరకు నటిగా మారాను. 'ఒరు ఆడార్ లవ్' నా తొలి సినిమా. ఇందులోని పాటలో కన్నుగీటిన అమ్మాయిగా నాపై ముద్రపడింది. అది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఒకేసారి నాకు అంత పేరు రావడంతో మా ఫ్యామిలీ అంతా టెన్షన్ పడ్డారు. బయటికి వెళితే చాలా మంది నా చుట్టూ గుమిగూడేవారు. స్కూల్ లైఫ్ని తెలిపే చిత్రమిది. ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ చిత్రాన్ని నాలుగు దక్షిణాది భాషల్లో ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నాం. ఈ చిత్ర ఆడియో వేడుకకి అల్లు అర్జున్ గెస్ట్గా రావడం ఆనందంగా ఉంది.
సోషల్ మీడియా వల్ల పాజిటివ్తోపాటు నెగటివ్ కూడా ఉంది. కానీ నాకు మంచే జరిగింది. దీని కారణంగా నాకు తెలుగుతోపాటు పలు భాషల నుంచి సినీ అవకాశాలు క్యూ కట్టాయి. నేను ఏ సినిమాకి అంగీకరించలేదు. ఈ పాట విడుదలయ్యే నాటికి ఆ సినిమాని
ఇంకా చిత్రీకరించలేదు. ఇప్పుడు కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో బన్నీ
చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ 'ఒరు ఆడార్ లవ్' పూర్తి కాకపోవడం వల్ల నటించలేకపోయా. అంతేకాని రెమ్యూనరేషన్ నచ్చక తిరస్కరించిందనే వార్తల్లో వాస్తవం లేదు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. స్క్రిప్ట్స్ని నాన్నగారితోనూ చర్చిస్తాను.
అంతిమ నిర్ణయం నాదే. 'శ్రీదేవి బంగ్లా' చిత్రానికి సంబంధించిన వివాదంతో నాకు సంబంధం లేదు. అది మా దర్శక, నిర్మాతలు చూసుకుంటారు. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం. ఓ నటిగా నేనేంటో నిరూపించుకోవాలి. నాకు వచ్చిన వింకిల్ గర్ల్ అనే ఇమేజ్ ఆరంభంలో ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. నాకు వచ్చిన పేరుకి మించి ఎదగాలనుకుంటున్నా' అని అన్నారు.