Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఇంత అభిమానం ఉందని తెలిస్తే ఈ సినిమా తీసే ధైర్యం చేసేవాడిని కాదేమో. కానీ సినిమా చూశాక వాళ్ళు ప్రశంసిస్తున్న తీరు నాకెంతో సంతోషాన్నిస్తుంది' అని దర్శకుడు మహివి రాఘవ్ అన్నారు. వైఎస్.రాజశేఖర్రెడ్డి జీవితం ఆధారంగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యాత్ర'. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజరు చిల్లా, శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం విడుదలైన సినిమాకి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ, 'కళకి, అభిమానానికి వెల కట్టలేం. అభిమానం కంటే గొప్పది మరేది లేదు. నేను భవిష్యత్లో వంద కోట్ల సినిమా తీయొచ్చు, ఎన్నో చిత్రాలు చేయొచ్చు, కానీ ఇంతటి అభిమానం రాదు. వైఎస్ చేపట్టిన పాద యాత్రలోని మైన్యూర్ సన్నివేశాలకి కూడా ఆడియెన్స్ రెస్పాండ్ అయి, ప్రశంసిస్తున్నారు. 'మాతృదేవోభవ' చిత్రానికి ఏడ్చాం. ఇప్పుడు పితృదేవోభవ లాంటి సినిమా చేసి ఏడిపించావంటున్నారు. కొందరు సినిమాలోని సన్నివేశాలకి కనెక్ట్ అయి మేం మళ్ళీ బయటకి వచ్చాం, మళ్ళీ రాజన్నని చూపించావని చెప్పడం గొప్ప ఆనందానిస్తుంది. మన దగ్గర లెక్కలకే ప్రాధాన్యతనిస్తారు. అది అలవాటైపోయింది. కానీ కంటెంట్ ముఖ్యం. క్లైమాక్స్లో పెయిన్ని తెలియజేయాలని పెంచలదాస్ పాట పెట్టాం. అది ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తర్వాత నాపై ఎలాంటి ముద్ర పడుతుందో తెలియదు. దాని వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు' అని అన్నారు. 'ఇది పొలిటికల్ చిత్రం కాదు. మమ్ముట్టి వైఎస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన నటన హైలైట్. మహేష్బాబు, నాగార్జున వంటి పలువురు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ కూడా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మేం ఊహించినదానికంటే భారీగా కలెక్షన్లు రావడం చాలా హ్యాపీగా ఉంది. రెస్పాన్స్ పట్ల మమ్ముట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. మలయాళంలోనూ స్పందన అద్బుతంగా ఉంది. అక్కడ టికెట్లు దొరకడం లేదట. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది. ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాని నిర్మించినందుకు గర్వంగా ఉంది' అని నిర్మాత విజయ్ చిల్లా తెలిపారు.