Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఎస్ఆర్-టీవీ9 జాతీయ అవార్డుల్లో 2017, 18కిగానూ ఉత్తమ నటులుగా బాలకృష్ణ, నాగార్జున ఎంపికయ్యారు. కళని, కళాకారులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత కొంత కాలంగా 'టీఎస్ఆర్-టీవీ9 జాతీయ అవార్డులను టి.సుబ్బరామిరెడ్డి అందిస్తున్న విషయం విదితమే. 2017,18 సంవత్సరాలకిగానూ ఈ ఏడాది అవార్డులను అందజేయనున్నారు. ఈ అవార్డుల ప్రకటన కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అవార్డు కమిటీ చైర్మెన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, 'ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఆదివారం వైజాగ్లో నిర్వహిస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని సేకరించి పురస్కారాల్ని అందిస్తున్నాం. 'మహానటి', 'రంగస్థలం', 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. వంటి మంచి చిత్రాలకే అవార్డులు ఇవ్వనున్నాం. శ్రీదేవి, దాసరి నారాయణరావు పేరిట కూడా అవార్డులను అందిస్తున్నాం. హిందీ, తమిళ, కన్నడ, భోజ్పురి, పంజాబీ చిత్రాల్ని కూడా అవార్డులతో గౌరవిస్తున్నాం. ఈ అవార్డు ప్రదాన వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు' అని అన్నారు. 'ఈ అవార్డుల జ్యూరీలో నేను సభ్యురాలిని కావడం ఆనందంగా ఉంది. ఈసారి నాకు జీవన సాఫల్య పురస్కారం లభించింది. నటిగా నా కెరీర్ ఆగిపోలేదు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాను' అని నటి నగ్మా తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'కళాకారుల్ని గౌరవించడం సుబ్బిరామిరెడ్డి చూసి నేర్చుకోవాలి. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే సుబ్బరామిరెడ్డికి ఆనందం. ఈ దేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు ఆయనే. అందరికంటే కష్టమైన పని జ్యూరీలో సభ్యుడిగా ఉండటం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం?.. అలా ఈ హీరోహీరోయిన్లు అంతా చంద్రమామలే' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యురాలు డా|| శోభన కామినేని, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు.
విజేతల వివరాలు :2018కిగానూ ఉత్తమ కథానాయకుడు రామ్చరణ్ (రంగస్థలం), ఉత్తమ నటి కీర్తిసురేష్ (మహానటి), ఉత్తమ కథానాయిక పూజా హెగ్డే (అరవింద సమేత), 2017కిగానూ ఉత్తమ నటి రకుల్ ప్రీత్ సింగ్ (రారండోరు వేడుక చూద్దాం), ఉత్తమ కథానాయిక రాశీఖన్నా (జై లవకుశ) ఎంపికయ్యారు. దీంతోపాటు షాలినీపాండే, రాజేంద్రప్రసాద్, వి.వి.వినాయక్, క్రిష్, సుకుమార్, రాజశేఖర్, అఖిల్, నాగచైతన్య, కళ్యాణ్రామ్, సుమంత్, ఆది పినిశెట్టి, దేవిశ్రీప్రసాద్, తమన్, కళ్యాణ్దేవ్, అలీ, బి.జయ, బోనీ కపూర్ పలు విభాగాల్లో అవార్డులకి ఎంపికయ్యారు. శ్రీదేవి స్మారక పురస్కారం విద్యాబాలన్కి, దాసరి స్మారక పురస్కారం మోహన్బాబుకి లభించింది. అవుట్స్టాండింగ్ సినీ లిరిక్ రైటర్ అవార్డుకి సిరివెన్నెల ఎంపికయ్యారు.