Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను రాజకీయాలు చేయటానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చా' అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన చిత్రం 'ఎన్టీఆర్- మహానాయకుడు'. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందించిన బయోపిక్ ఇది. విద్యాబాలన్, కళ్యాణ్రామ్, రానా, సుమంత్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రిష్ దర్శకత్వంలో ఎన్బీకే ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా పతాకాలపై నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే మొదటి పార్ట్ 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం విదితమే. ఇక ఈ నెల 22న 'ఎన్టీఆర్ - మహానాయకుడు'ని విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్ ట్రైలర్ని విడుదల చేసింది. ఎన్టీఆర్గా బాలకృష్ణ శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. 'ఇచ్చిన ప్రతి మాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనబడాలి. ఇన్ టైమ్ ఆన్ డోర్' అంటూ ఆయన చెప్పే డైలాగులు, రాజకీయ ఎత్తులు, ముఖ్యమంత్రిగా ప్రవేశ పెట్టిన పథకాలు, తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలు, రాజకీయ ఆటుపోట్లను, ఎదుర్కొన్న సవాళ్ళని ఇందులో చూపిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
'ఎన్టీఆర్ రాజకీయ జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ఇందులో బాలకృష్ణ నట విశ్వరూపం చూడొచ్చు. కచ్చితంగా అన్ని వర్గాలని ఆకట్టుకుంటుంది' అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్.