Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సీనియర్ నటుడు డీఎస్ దీక్షితులు సోమవారం కన్నుమూశారు.
ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా సెట్లోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన చిత్రం బృందం నాచారం ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. గుంటూరు జిల్లా రేపల్లెలో 1956, జులై 28న జన్మించారు. సంస్కృత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ చేశారు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తొలుత రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేశారు. లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్లోని ఏపీ థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిపోర్టరీలో డిప్లోమా ఇన్ థియేటర్ ఆర్ట్స్లో చేరారు. శిక్షణ సమయంలో పలు నాటకాల్లో నటించడంతోపాటు 'హరిశ్చంద్ర', 'సక్కుబాయి', 'వ్యవహార ధర్మబోధిని', 'వెయిటింగ్ ఫర్ గోడో', 'స్వతంత్ర భారతం', 'గోగ్రహణం', 'కొక్కొరోకో', 'జాతికి ఊపిరి స్వతంత్రం' వంటి నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు.
ఈయన నటించిన 'ఆగమనం' సీరియల్కి బోల్డెన్ని నంది అవార్డులు లభించాయి. 'మురారి', 'ఇంద్ర', 'ఠాగూర్', 'ప్రాణం', 'వర్షం', 'అతడు' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం అక్కినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్లో ప్రదర్శన కళలన్నింటికీ సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 'శ్రీకృష్ణతులాభారం' పద్యనాటకానికి నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు అవార్డులనూ పొందారు. దీంతోపాటు ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారం కూడా అందుకున్న దీక్షితులకు కుమారుడు శ్రీధర్, కోడలు సుజాత ఉన్నారు.