Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇంత మంది హీరోలను ఒకే స్టేజ్పైకి తీసుకురావడం టి.సుబ్బరామిరెడ్డికే సాధ్యమైంది. మేమంతా ఆయనపై ప్రేమతో వచ్చాం. మా మధ్య సోదరానుబంధం ఉందని ప్రతి ప్రేక్షకుడికి తెలియజేసే సందర్భమిది' అని చిరంజీవి అన్నారు. 2017, 2018 సంవత్సరాల సినిమాలకి సంబంధించి 'టీఎస్ఆర్-టీవీ9' జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం వైజాగ్లో అంగరంగ వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజేతలకి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, 'తమ అభిమాన నటీనటులను, టెక్నీషియన్లని సత్కరిస్తుంటే ప్రతి భాషా ప్రేక్షకులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ఎంతో కష్టపడి టీవీ9 సహాయంతో ఈ అవార్డ్స్లను ప్రకటించాం. నాకు అభినందనలు కాదు, కళాకారుల ఆనందం కావాలి. అందుకే గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. మీ అందరి సంతోషమే నా శక్తి. ఒకే వేదికపై చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ, నాగార్జున, విశాల్ లాంటి హీరోలను చూడటం కన్నుల పండుగగా ఉంది. భారత దేశ చరిత్రలో ఏ అవార్డ్ల ఫంక్షన్ కూడా ఇలా ప్రజల సమక్షంలో జరగలేదు. అభిమానుల ఆనందం నాకు టానిక్ లాంటిది' అని అన్నారు. 'ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక బృహత్తర కార్యాన్ని నిర్వహించడం ఆషామాషీ కాదు. ఈ కార్యక్రమంలో అందరినీ ఒకే వేదికపై కలపడం ఒక్క టీఎస్ఆర్కే చెల్లింది. ఆయన అజాత శత్రువు. ఒక్క పిలుపునిస్తే అందరం హాజరవుతాం. అభిమానులకు ఎన్నో మంచి సినిమాలు ఇవ్వమని వెన్ను తట్టి ముందుకు నడిపేదే 'టీఎస్ఆర్-టీవీ9' అవార్డులు' అని బాలకృష్ణ తెలిపారు.
మంచు మోహన్బాబు చెబుతూ, 'ప్రతి కళాకారుని హృదయంలో నాకు చోటుంటే చాలన్న మహోన్నత వ్యక్తి సుబ్బరామిరెడ్డి. ఆయన పాల లాంటి వారు. ఎవరికి ఏం కావాలో తీసుకోవచ్చు. మన మధ్య దాసరిగారు లేకపోవడం తీరని లోటు' అని చెప్పారు. 'అందమైన మనుషులు, అన్నయ్యలందరు వేదికపై ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన 'రంగస్థలం', 'మహానటి', 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాలకి అవార్డులు రావడం ఎంతో సంతోషాన్నిస్తుంది' అని నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాల్, రాజేంద్రప్రసాద్, సిరివెన్నెల, విద్యాబాలన్, బోనీ కపూర్, రాశీఖన్నా, ఖుష్బు, పూజా హెగ్డే, అదితి రావు హైదరీ, కీర్తిసురేష్, దేవి శ్రీప్రసాద్, థమన్, సుమంత్, అలీ, నరేష్, ప్రియమణి, ఆది పినిశెట్టి, కేథరిన్, పరుశురాం, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తదితరులు అవార్డులు అందుకున్నారు.