Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొన్నాళ్ళ క్రితం 'ది మోటర్ సైకిల్ డైరీస్' సినిమా చూశా. అందులో హీరో జర్నీని చూపిస్తారు. చివరకి అతనే చేగువేరా అని ట్విస్ట్ ఇచ్చే విధానం నాకెంతో బాగా నచ్చింది. ఇలా మనం కూడా సినిమా తీస్తే బాగుండూ అనే ఆలోచనే ఈ చిత్రానికి కారణమైంది' అని అంటున్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న చిత్రానికి 'ఆర్ఆర్ఆర్' అనే టైటిల్ని ఖరారు చేశారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో స్టార్ కాస్ట్తోపాటు చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, 'నా ప్రతి సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తాను. ఆడియెన్స్కి ఎలాంటి అనుభూతి ఇవ్వబోతున్నానని చెప్పేందుకు ప్రయత్నిస్తా. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం గురించి చెప్పలేకపోయాం. కానీ ఇప్పుడు చెప్పాలనుకున్నాం. 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీష్ చదువుతోపాటు పురాణాలు, ఇతిహాసాలు కూడా చదువుకున్నారు. యోగా ఎక్స్పర్ట్ కూడా. యుక్త వయసులో ఆయన ఇల్లు వదిలి తీర్థయాత్రలకు వెళ్లారని కొందరు, తపస్సుకు వెళ్ళారని మరికొందరు చెబుతుంటారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారో, ఏం చేశారో ఎవరికీ తెలియదు. రెండేండ్లకు తిరిగొచ్చాక గిరిజనుల కోసం బ్రిటీష్వారితో ఉద్యమం చేసి చనిపోయారు. అల్లూరి పుట్టిన నాలుగేండ్ల గ్యాప్తో 1901లో ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్లో కొమురం భీమ్ పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో నిరక్షరాస్యుడిగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడనేది తెలియదు. వచ్చేటప్పుడు మాత్రం చదువుకున్న వాడిగా వచ్చారు. ఆయన కూడా ట్రైబల్స్ కోసం నైజాం సర్కార్తో పోరాడారు. వీరిద్దరు యాదృచ్చికంగా ఒకే టైమ్లో పుట్టడం, ఒకే టైమ్లో వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియకపోవడం?, వచ్చిన తర్వాత ఒకేలా ఫైట్ చేయడం నాకు ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆ విషయాన్నే ఇందులో చెప్పబోతున్నాం. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఈ ఇద్దరు పోరాట యోధులు, చరిత్రలో ఎప్పుడూ కలవని వారు, ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు, మనకు తెలియని టైమ్లో కలుసుకుంటే?, ఒకరికొకరు ఇన్స్పైర్ అయితే? ఆ తర్వాత బ్రిటీష్వారిపై పోరాటం వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం వల్ల ఏర్పడి ఉంటే ? ఎలా ఉంటుందనే పాయింట్ ఆసక్తికరంగా అనిపించింది.
ఇది తెలిసిన యోధుల గురించి తెలియని కథ. 1920లో ఉత్తర భారతదేశంలో జరిగిన కథ. కల్పిత కథతో లార్జ్ స్కేల్లో చేస్తున్నాం. అయితే ఆ టైమ్లో వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారనే దానిపై చాలా రీసెర్చ్ చేశాం. ఆ రోజుల్లో జీవన విధానం ఎలా ఉండేది?, ఎలాంటి దుస్తులు ధరించేవారు?, ఎలాంటి వర్తకం ఉండేది? వంటి వాటిపై పరిశోధన చేసాం. అందుకే టైమ్ పట్టింది. ఇందులో యువ అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, యువ కొమురం భీమ్గా తారక్ నటిస్తున్నారు. వీరితోపాటు సపోర్టింగ్ పాత్రలు కూడా ఉన్నాయి. చరణ్కి జోడీగా అలియాభట్, తారక్కి జోడీగా డైజీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. ఫ్లాష్బ్యాక్లో వచ్చే శక్తివంతమైన పాత్రలో అజరు దేవగన్, అలాగే సముద్రఖని నటిస్తున్నారు. ముందుగా సినిమాకి 'ఆర్ఆర్ఆర్' వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ దీనికి అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. దీన్నే అన్ని లాంగ్వేజెస్లో టైటిల్గా ఫైనల్ చేశాం. 'ఆర్ఆర్ఆర్'కి ఎక్స్టెన్షనల్గా కొన్ని పేర్లు వస్తున్నాయి. అవి వివరణాత్మకంగా ఒక్కో భాషల్లో ఒక్కో పేరును ఖరారు చేస్తాం.
సినిమాలో తారక్, చరణ్ల ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయనకో ఫైట్, ఇయనకో ఫైట్, ఆయనకో సాంగ్, ఈయనకో సాంగ్ పెడితే సినిమాలో మెయిన్ ఎమోషన్ మిస్ అవుతుంది. ఓ ఫిల్మ్ మేకర్గా బలమైన కథ ఉందా లేదా అనేదే చూస్తాను. ధియేటర్కి వచ్చిన ప్రేక్షకులు పది నిమిషాల్లో తారక్, చరణ్ పాత్రలను మర్చిపోయి రియల్ హీరోలని మాత్రమే చూడగలరనేలా చేశా. ఆడియెన్స్కి హత్తుకునేలా బ్యాలెన్స్ చేశా.
సినిమాలో భారీ గ్రాఫిక్స్కి స్కోప్ ఉంది. సినిమాని ఒకేపార్ట్గా తీస్తున్నాం. సీక్వెల్స్ ఉండవు. ఇక మహాభారతం గురించి అంతా అడుగుతున్నారు. ఒకవేళ తీస్తే అదే నా చివరి చిత్రం అవుతుంది' అని అన్నారు.
ఇద్దరం చాలా ఎగ్జైట్ అయ్యాం : రామ్చరణ్
'ఈ సినిమా వర్కౌట్ కావడం ఇప్పటికీ నమ్మకలేకపోతున్నా. నేను రియాలిటీలోనే ఉన్నానా? అనే ఫీలింగ్ కలుగుతోంది. ఎప్పట్నుంచో రాజమౌళితో పనిచేయాలని అనుకోవడం, నాకు ఇండిస్టీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్, దగ్గరైన వ్యక్తి తారక్తో కలిసి నటించడం, దానయ్య ప్రొడక్షన్స్లో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అయితే దాదాపు ఏడాది క్రితం ఎయిర్ఫోర్ట్కి వెళ్లే ముందు రాజమౌళి తన ఇంటికి రమ్మన్నారు. వెళ్ళగానే తారక్ నేలమీద మంచి ఫోజులో ఉండటాన్ని చూసి తనేంటి ఇక్కడున్నాడు అనుకున్నా. నువ్వేంటి బ్రో అని తారక్ని అడిగితే, మీరేమైనా మాట్లాడుకోవాలా, నేను బయటకు వెళ్ళాలా అని తారక్ అన్నాడు. కొంత సేపు కన్ఫ్యూజన్లో ఉంచి, మమ్మల్ని లోపలికి పిలిచి ఈ ప్రాజెక్ట్ని రాజమౌళి ప్రకటించారు. ఇద్దరం చాలా ఎగ్జైట్ అయ్యాం. ఇద్దరం ఒకేసారి ఓకే చెప్పాం. ఆ సంఘటన నా జీవితంలో మరిచిపోలేను. అప్పుడు తీసిన ఫొటేనే వైరల్ అయ్యింది' అని చెప్పారు.
అది మా అదృష్టం: ఎన్టీఆర్
'ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉంటాను, కానీ ఇప్పుడెందుకో చాలా నర్వస్గా ఉంది. నాకిది జక్కన్నతో నాలుగో చిత్రం. అన్నింటికంటే ఓ ప్రత్యేకమైన సినిమాగా నా కెరీర్లో నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాకి జక్కన్నతో పనిచేయడంతోపాటు రామ్చరణ్తో కలిసి నటించడం. ఈ సినిమా మా నుంచి చాలా డిమాండ్ చేస్తుంది. అల్లూరి, కొమురం భీమ్ వంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి మనకు తెలియని ఓ గీత ఉంది. ఇద్దరూ కలిసి ఉంటే అనే కొత్త పాయింట్ మాకు ఎగ్జైటింగ్గా అనిపించింది. ఈ స్టోరీ విషయంలో పూర్తిగా బ్లాంక్గా ఉన్నాను. ఓ నటుడికి ఎంత సమాచారం తక్కువగా ఉంటే, అంత బాగా నటిస్తాడనేది నా నమ్మకం. నేను, చరణ్ నటులుగా ఎదగడానికి ఈ సినిమా ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి గొప్ప పాత్రలను చేయడం గొప్ప విషయం. ఇదొక గొప్ప చిత్రమవుతుందని నమ్ముతున్నా. ఇందులో భాగం కావడం మా అదృష్టం. మా జనరేషన్లో ఇది సాధ్యం కావడం జక్కన్న మాపై ఉంచిన నమ్మకమే. మా నమ్మకం ఈ చిత్రానికి ఓ పాజిటివిటీగా మారి ఆడియెన్స్ అద్భుతమైన అనుభూతికి లోనవుతారని నమ్ముతున్నా. సినిమా ఎంతటి హిట్ అవుతుందనేది పక్కన పెడితే ఇద్దరు తెలుగు హీరోల చరిత్ర దేశం మొత్తానికి తెలుస్తుంది' అని చెప్పారు.
భారతదేశం గర్వించదగ్గ చిత్రం: నిర్మాత డి.వి.వి.దానయ్య
భారతదేశం గర్వించదగ్గ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతం. రెండు పెద్ద కుటుంబాలకి చెందిన సమ ఉజ్జీలైన హీరోలతో ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళికి జీవితాంతం రుణ పడి ఉంటాను. భారీ బడ్జెట్తో హై టెక్నీకిల్ వ్యాల్యూస్తో యావత్ భారతదేశం గర్వించదగ్గ చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నాం' అని చెప్పారు.