Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను బై లా ప్రకారమే వ్యవహరిస్తున్నాను. నరేష్ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేయడానికి నేను అడ్డుపడలేదు. ప్రెసిడెంట్గా ఎన్నికైన వాళ్ళు హుందాగా ప్రవర్తించాలి. 'మా'ని రోడ్డు మీదకి తీసుకురాకండి' అని అంటున్నారు శివాజీరాజా. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ గెలుపొందిన విషయం విదితమే. ఈ నెల 22న పదవి స్వీకారం చేసుకోకుండా శివాజీరాజా అడ్డుపడుతున్నారంటూ నరేష్ ఆరోపించిన విషయంపై మంగళవారం శివాజీరాజా స్పందించారు. 'కొంత కాలంగా 'మా'లో రాజకీయాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. 'మా' రూల్ ప్రకారం ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేయాలని ఉంది. గతంలో నేను అలానే చేశా. ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని నేను అడ్డుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో మేం డబ్బులు పంచామని ఆరోపించారు. కానీ వాళ్ళు 200 మంది ఆర్టిస్టులకి మందుతోపాటు భోజనం పెట్టించారు. అది ప్రలోభ పెట్టినట్టు కాదా?, నేను వచ్చాక అసోసియేషన్ డబ్బు రెండు కోట్ల రూపాయల నుంచి 5 కోట్లకు చేరింది. దాన్ని పది కోట్లు ఎలా చేయాలని కసిగా పనిచేస్తే ఆనందిస్తాను. ఓటమిని నేను అంగీకరిస్తున్నా. నా సేవలను ఇక చాలు అంటున్నారని, మరోకరికి సేవ చేసే అవకాశం ఇవ్వమని ఈ ఎన్నికల ఫలితాలు తెలిపాయి. ఓల్డేజ్ హౌమ్ పెట్టాలనే డ్రీమ్ ఉంది. కానీ ఈ ఎన్నికలతో అది చెదిరిపోయింది. కొంత మంది చేసిన కుట్రలకు నేను బలయ్యాను. ఈ విషయంలో చిరంజీవికి కృతజ్ఞుడినై ఉంటా. నేను చెప్పిన వెంటనే సైట్ గురించి కేటీఆర్తో మాట్లాడారు. ఎన్నికల వల్ల అది కుదరలేదు. ఈ విషయంలో చిరంజీవి రుణపడి ఉంటాను. ఎన్నికల ముందు నాగబాబు మమ్మల్ని విమర్శించారు. ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. నేను పదవిలో లేకపోయినా మా కోసం పని చేస్తా. ఇకనైనా మా పరువుని బజారుకి ఇడ్చకుండా చేయాల్సిన పనులపై దృష్టి పెట్టండి' అని అన్నారు.