Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎన్టీఆర్కి సంబంధించిన వెన్నుపోటులో చంద్రబాబుతోపాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా భాగమే. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా ఉంటున్నారు. ఇది నేను నమ్మిన నిజం. ఇది సినిమాలో ఉందా? లేదా? అనేది తెరపైనే చూడాలి' అని అంటున్నారు రామ్గోపాల్ వర్మ. నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చాక చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రామ్గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇది ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, 'ఎన్టీఆర్పై బయోపిక్ తీయాలని బాలకృష్ణ ఆ మధ్య నన్ను కలిశారు. ఆయన ఎన్టీఆర్ జీవితంలోని కాన్ఫ్లిక్ట్ అంశాలు లేకుండా సినిమాలు తీద్దామన్నారు. కానీ అలా కుదరదు. అప్పుడే నాకు ఈ ఐడియా తట్టింది. ఎన్టీఆర్ లైఫ్లో ఇలాంటి పాయింట్ ఒకటి లేకపోతే నేను సినిమా తీసేవాడిని కాదు. ఈ విషయంలో బాలకృష్ణ థ్యాంక్స్ చెప్పడమే కాదు, ఈ సినిమాని ఆయనకి అంకితమిస్తున్నా. కొంత మందిని కలవడం వల్ల, విశ్లేషణల వల్ల నేను తెలుసుకున్న దాన్ని బట్టి, నేను నమ్మినదాన్ని బట్టి ఈ చిత్రాన్ని రూపొందించాను. ఇలా జరగలేదు అని ఎవరైనా అనుకుంటే మరోలా సినిమా తీయొచ్చు. ఈ సినిమా విషయంలో వివాదం జరగడానికి కారణం నిజాలు బయటకు వస్తాయని భయంతో చేస్తున్నారు. విడుదల ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఫిల్మ్ మేకర్ని. బిజినెస్ చేసుకోవడానికి రాలేదు. ఎన్ని కోట్టు ఇచ్చినా, ఏం చేసినా రిలీజ్ని ఆపను. ఈ సినిమాని లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది. ఆయన చనిపోయేంత వరకు ఏం జరిగిందనేది చెప్పా. నాదెండ్ల భాస్కరరావు చేసింది పెద్ద కుట్ర కాదు. కానీ కుటుంబీకులు, రక్త సంబంధీకులు చేసింది పెద్ద కుట్రే అవుతుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషి ఎవరినో ఒకరిని, ఏదో రూపంలో వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. అయితే ఇప్పటి వరకు నాకెవరూ వెన్నుపోటు పొడవలేదు. నేను మాత్రం అందరికి ముందు పోటే పొడుస్తా(నవ్వుతూ). ఈ సినిమా వైసీపీకి అనుకూలంగా తీసిందనే మాటల్లో వాస్తవం లేదు. నేను ఏ పార్టీకి అనుకూలంగా చేయలేదు. ఇక ఇందులో కొత్త వాళ్ళని ఆర్టిస్టులుగా తీసుకోవడానికి కారణం పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు రియలిస్టిక్గా ఉండాలంటే కొత్తవాళ్ళయితేనే బాగుంటుందని నమ్మి ఎంపిక చేసుకున్నా. ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్టు విజరు అద్భుతంగా నటించారు. సెన్సార్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా తీశా. ఈ సినిమా విడుదలయ్యాక ఇదే నిజమేనని జనం నమ్మితే నేను విజయం సాధించినట్టే. ఇక ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ తీస్తున్నా. అది సెప్టెంబర్లో వస్తుంది. కేసీఆర్ బయోపిక్ కోసం పరిశోధన చేస్తున్నా. కేఏ పాల్పై బయోపిక్ తీసే ధైర్యం లేదు. నేను మొదటిసారి భయపడింది ఆయనకే' అని అన్నారు.